బీజేపీ జాతీయ కార్యవర్గం ఈ నెల 16, 17వ తేదీల్లో ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతోపాటు దాదాపు 350 మంది పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 17న ప్రధాని మోదీ ప్రసంగంతో సమావేశం ముగియనుంది. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహకలపై చర్చించేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కానుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో సభ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. ఎగ్జిక్యూటివ్ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల వరకు నడ్డాను కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 20న ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు లేకపోవడంతో వచ్చే లోక్సభ ఎన్నికల వరకు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగించవచ్చు.
కార్యనిర్వాహక సమావేశంలో రాజకీయ, ఆర్థిక ప్రతిపాదనలతో పాటు జీ-20 సదస్సుకు సంబంధించిన కార్యక్రమాలు, వాటిలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల భాగస్వామ్యంపై చర్చించనున్నారు. జీ-20కి సంబంధించిన తీర్మానాన్ని కూడా ఆమోదించే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రతిపాదనలపై హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగాలు చేయనున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు రూట్మ్యాప్ సిద్ధం చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. గతేడాది హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ కార్యకలాపాలను కూడా సమీక్షించనున్నారు. రానున్న కాలంలో నిర్వహించాల్సిన సంస్థ సంబంధిత కార్యక్రమాలు, వాటికి సంబంధించిన సన్నాహకాలపై చర్చ జరగనుంది. ఈ నెల 17 మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంతో సభ ముగుస్తుంది. కార్యవర్గంలో పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం కూడా ఉంటుంది. ఈ సమావేశం ఈ నెల 16న ఉదయం 10 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా అధ్యక్షతన జరగనుంది.
