ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై అందరి ఆసక్తి నెలకొంది. సెమీ బులెట్ రైలుగా దేశంలో ప్రవేశపెట్టిన ఈ రైలు టైమింగ్స్, టికెట్ ఎంతనే వివరాలు వెల్లడయ్యాయి. వందేభారత్ ఎక్స్ప్రెస్ అత్యాధునికం, అత్యంత వేగం. ఈ రైలు అంతర్గతంగా, బాహ్యంగా అద్భుతమైన లుక్లో ఉంటుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న రైలు ఇది. ఇప్పటికే దేశంలో ఏడు వందేభారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ప్రారంభం కానున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 8వది. బుల్లెట్ ట్రైన్ తరహాలో ముందుభాగం, బయటి దృశ్యాలు వీక్షించేందుకు వీలుగా ఫుల్ గ్లాస్ సెట్టింగ్ ప్రత్యేకత. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు కాగా 140 సెకన్లలోనే అందుకోగలదు. కానీ ట్రాక్ సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అంతవేగం ప్రయాణించదు. సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్ కావడంతో కుదుపులుండవు.
ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఉంటుంది. డోర్ వ్యవస్థ నియంత్రణంతా లోకో పైలట్ చేతిలో ఉంంటుంది. మెట్రో రైలుకున్నట్టే డోర్ సిస్టమ్ ఉంటుంది. వారంలో ఆదివారం మినహా మిగిలిన ఆరురోజులు ఈ రైలుంటుంది. ఈ రైలులో 14 ఏసీ ఛైర్ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్లు ఉంటాయి మొత్తం 1128 మంది ప్రయాణీకులకు అవకాశముంటుంది. విశాఖపట్నం నుంచి నెంబర్ 20833తో ఉదయం 5.55 గంటలకు ప్రారంభమై..మద్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రాజమండ్రికి ఉదయం 7.55 గంటలకు, విజయవాడకు 10 గంటలకు, ఖమ్మం 11 గంటలకు, వరంగల్ 12.05 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి అదే రోజు మద్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై..రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. వరంగల్కు మద్యాహ్నం 4.35 గంటలకు, ఖమ్మం మద్యాహ్నం 5.07 గంటలకు, విజయవాడ సాయంత్రం 7 గంటలకు, రాజమండ్రికి 8.50 గంటలకు చేరుకుంటుంది. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు చెయిర్కార్ ఛార్జి కేటరింగ్, ఇతర పన్నులతో కలిపి 1720 రూపాయలు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర 3170 రూపాయలుంది.
