తెలంగాణ నిరుద్యోగ అభ్యర్ధులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక

తెలంగాణ నిరుద్యోగ అభ్యర్ధులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. స్థానికత ఇబ్బందితో నిలిచిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఆ వివరాలు ఇలా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 పోస్టులకు 2022 అక్టోబర్ 16వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల కోసం 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీ విడుదలైంది. అభ్యంతరాల్ని పరిగణలో తీసుకుని 5 ప్రశ్నల్ని తొలగించాక పైనల్ కీ నవంబర్ 15, 2022న విడుదలైంది. ఆ తరువాత స్థానికత అంశంతో గ్రూప్ 1 ఫలితాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. ఈ వివాదం హైకోర్టుకు చేరడంతో..స్థానికత అనే ఒకే అంశంతో ఫలితాలు ఆపడం వల్ల ఇతర అభ్యర్ధులు ఇబ్బందులు పడతారని హైకోర్టు తెలిపింది.

దాంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల్ని ప్రభుత్వం విడుదల చేసింది. జూన్, 2022న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరగనుంది. ప్రతి 50 మందికి ఒకరి చొప్పున మెయిన్స్ పరీక్షకు అభ్యర్ధుల్ని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్ధుల జాబితా టీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి. హైకోర్టులో స్థానికత అంశం క్లియర్ కావడంతో ప్రభుత్వం వెంటనే ఫలితాలు వెల్లడించింది. ఈ ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలుంటే..టీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ ను పనివేళల్లో సంప్రదించాలని టీపీఎస్సీ కోరింది. జూన్ నెలలో జరిగే మెయిన్స్ పరీక్ష ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది ఈ నెల 18వ తేదీన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. మరోవైపు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాట్టు టీపీఎస్సీ వెల్లడించింది. ఒకే మార్కుల్ని ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పంచుకుంటే..స్థానికత ఆధారంగా ఖరారు చేసినట్టు టీపీఎస్సీ తెలిపింది.

Editor