తాజాగా ఏర్పాటు చేసిన యువశక్తి సభలో ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా ఏర్పాటు చేసిన యువశక్తి సభలో ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆయన మీద ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రులు వరుసగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ 1800 కోట్ల రూపాయలు పోలాండ్‌కు హవాలా చేస్తూ సాక్ష్యాధారాలతో కేంద్రం చేతికి చిక్కాడని ప్రచారం జరుగుతోందని, రెండు మూడు నెలల నుంచి ఈ ప్రచారం సాగుతోంది అంటూ దాడిశెట్టి రాజా కామెంట్ చేశారు. ఇక తన భీమ్లా నాయక్ సినిమాను అడ్డుకోవడం వల్ల రూ.30 కోట్లు పోయాయి అని పవన్ అంటున్నారని.. ఆ సినిమా ప్రొడక్షన్ ఖర్చు రూ.20 కోట్లు దాటలేదని అలాంటిది 30 కోట్ల నష్టం అనడం ఏమిటి అంటూ దాడిశెట్టి రాజా విమర్శించారు. నాసిరకం సినిమాను జనం చూడకపోతే.. దానికి ప్రభుత్వం ఏం చేస్తుందని రాజా ప్రశ్నించారు.

ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలకు పిల్లలు చేయకూడని పనులు చేసి కేసుల్లో ఇరుక్కుంటే బాధ్యత ఆయన వహిస్తాడా అని మంత్రి నిలదీశారు. 2014-19 మధ్య జనసేన, టీడీపీ ప్రభుత్వంలో అత్యధికంగా కాపులపై కేసులు పెట్టారని.. ఈ విషయాన్ని కాపులు మరచిపోలేదన్నారు రాజా. చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేదన్న రాజా, పవన్ తాపత్రయం అంతా చంద్రబాబు కోసమే అని కూడా ఆరోపించారు. మంత్రులపై ఇష్టారాజ్యంగా పవన్ మాట్లాడుతున్నాడని పేర్కొన్న ఆయన కాపు సామాజికవర్గ నేతలే టార్గెట్‌గా పవన్ విమర్శలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. అంతేకాక చంద్రబాబు,పవన్ ఒక్కటేనని తాము ముందు నుంచి చెప్తున్నామని ఇప్పుడు పవన్ జోకర్ చేష్టలు, బ్రోకర్ చేష్టలకు కాపులంతా ఆయనను చూసి అసహ్యించుకుంటున్నారని మంత్రి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సభలకు వచ్చే యువతను పవన్ రెచ్చగొడుతున్నారని పేర్కొన్న దాడిశెట్టి రాజా పవన్ ఎంతమందితో వచ్చినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. 175 స్థానాల్లో గెలిచి తీరుతామని మంత్రి రాజా ధీమా వ్యక్తం చేశారు.

Posted Under AP
Editor