Latest Posts

దయాది దేశం పాకిస్థాన్‌లో నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు

దయాది దేశం పాకిస్థాన్‌లో నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్‌ నుంచి పాలు, పిండి నుంచి ఉల్లిపాయల వరకు అన్నింటి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం అన్ని వైపుల నుంచి పాకిస్థాన్‌పై ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, రాజకీయ అస్థిరత, జీడీపీలో భారీ క్షీణతతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఆ దేశంలోని భారతీయ కంపెనీలు కూడా నష్టాల్లో ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో పాక్ ఆర్థిక పరిస్థితి మన దేశంపై ఎలా ప్రభావం చూపిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. చైనా చొరబాటు ఇలా.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాకిస్థాన్‌లోనూ, నేపాల్‌లో ప్రచండ ప్రభుత్వంలోనూ చైనా చొరబాటు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్, చైనా, నేపాల్ కూడా భారత్‌కు పెద్ద సవాల్‌గా మారవచ్చు. మరో పొరుగు దేశం అప్ఘానిస్థాన్‌లో ప్రస్తుతం తాలిబన్ల ప్రభుత్వం ఉంది. ఇది పాకిస్థాన్‌కు సహకరిస్తే.. ఆ దేశం పూర్తిగా ఉగ్రవాద నియంత్రణలోకి వెళ్లి.. భారత్‌కు ముప్పుగా మారుతుంది. మౌలిక సదుపాయాల పేరుతో పాకిస్థాన్‌కు చైనా సాయం చేస్తూ.. భారత్‌కు వ్యతిరేకంగా వ్యూహం రచన చేస్తుంది.

చైనా కూడా తన వాణిజ్య ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు. నష్టపోతున్న కంపెనీలు ప్రస్తుతం పాకిస్థాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇక్కడ ఉన్న దేశీయ, విదేశీ కంపెనీలపై ప్రభావం చూపుతోంది. చాలా కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి. పాకిస్థాన్ కంపెనీల దుస్థితి ప్రభావం జిందాల్, టాటా వంటి భారతీయ కంపెనీలపై కూడా కనిపిస్తోంది. జిందాల్ గ్రూప్ పాకిస్థాన్‌లో మంచి బిజినెస్ ఉంది. ఉక్కు పరిశ్రమతో పాటు ఇంధన రంగంలో కూడా యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు అక్కడి వ్యాపారాలన్నీ సంక్షోభానికి గురైతే.. ఈ కంపెనీ కూడా నష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. టాటా గ్రూప్ టెక్స్‌టైల్ మిల్స్ లిమిటెడ్ కూడా పాక్ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోంది. ఇప్పుడు అక్కడి వ్యాపారాలన్నీ దివాళా తీస్తే.. దాని ప్రభావం ఈ కంపెనీపై కూడా పడనుంది. అంతేకాకుండా పాకిస్థాన్‌కు పంపించే వస్తువులపై కూడా ప్రభావం చూపనుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ 2021లో భారత్ నుంచి దాదాపు 503 మిలియన్ డాలర్లను దిగుమతి చేసుకుంది. ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, చక్కెర, కాఫీ-టీ, అల్యూమినియం, ప్లాస్టిక్ వస్తువులను పాక్ దిగిమతి చేసుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ఈ వస్తువులకు సంబంధించిన భారతీయ కంపెనీల వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది.

Editor