హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ పేలడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. పానిపట్లోని తహసీల్ క్యాంప్లోని రాధా ఫ్యాక్టరీ సమీపంలో గురువారం ఉదయం భారీ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు, తమ నలుగురు పిల్లలతో ఇంట్లోనే ఉన్నారు. మృతులను అబ్దుల్ కరీం (50), అతని భార్య ఆఫ్రోజా (46), పెద్ద కుమార్తె ఇష్రత్ ఖాతున్ (18), రేష్మా (16), అబ్దుల్ షకూర్ (10), అఫాన్ (7)గా గుర్తించారు. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్కు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిలిండర్ ఎలా పేలిందో ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గది తలుపులు మూసి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం గురించి పాన్పీట్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ మాట్లాడుతూ.. గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.
ఇక్కడ అద్దె ఇంట్లో భార్యాభర్తలు, నలుగురు పిల్లలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిచి విచారణ చేపట్టారు. ప్రమాదంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తర్వాత ఇంటి పక్కనే ఉన్న ప్రాంతాన్ని పోలీసులు సీల్ చేశారు. ప్రస్తుతం మృతుడి దగ్గరి బంధువులను పోలీసులు సంప్రదిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చలి తీవ్రతకు ప్రజలంతా ఇళ్లలోనే ఉన్నారు. ప్రమాద బాధితులు చాలా ఏళ్లుగా పానిపట్లో ఉంటున్నారు. సజీవ దహనం తర్వాత మృతదేహాలు బొగ్గు మారినట్లు తెలుస్తోంది. సిలిండర్ పేలడంతో ఇంట్లో మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అగ్నిమాపక దళం వాహనాలు వచ్చే సమయానికి అంతా జరిగిపోయింది.
