ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి అప్పుడే పదేళ్లు కావస్తున్నా..రెండు రాష్ట్రాల మధ్య ఆస్థులు, ఆస్థుల విభజన మాత్రం పూర్తి కాలేదు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్పై సుప్రీంకోర్టు..తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. ఆస్థులు, అప్పుల విభజనపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్పై సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనం కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు పంపి..విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది. 2014 చట్టం ప్రకారం విభజన జరిగి..ఆస్థులు, అప్పుల పంపిణీపై స్పష్టమైన విధానం ఉన్నా..కోట్లాది రూపాయల ఆస్థులు ఇంకా ఏపీకు రాలేదని సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ తెలిపారు.
91 శాతం ఆస్థులు ఇంకా హైదరాబాద్లోనే ఉన్నందున తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందనేది ఏపీ ప్రభుత్వం వాదన. 2014 జూన్ 2 విభజన జరిగినప్పటి నుంచి ఆస్థులు, అప్పుల పంపిణీపై విచారణ జరపాలని పదే పదే విజ్ఞప్తి చేసినా ఇంకా విభజన సమస్య పరిష్కారం కాలేదు. విభజన అనంతరం 245 సంస్థల ఆస్థుల మొత్తం విలువ 1,42,601 కోట్లు. ఈ ఆస్థుల్ని రెండు రాష్ట్రాల మధ్య సమానంగా విభజించాల్సి ఉంది. ఇది జరగకపోవడంతో ఏపీలోని ఆ సంస్థ పనితీరు ప్రభావితమై..ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి దయనీయంగా మారిందని ఏపీ ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది.
