తెలంగాణ సీఎం కేసీఆర్ లెక్కలు పక్కాగా ఉంటాయి. చిక్కడు దొరకడు అన్నట్టుగా.. సమర్థులను.. తనకు అనువైనవారినే ఎంచుకుంటారు. వెనుకటి రాజులు తెలివైన బ్రాహ్మణులనే తన మంత్రివర్గంలో కీలక శాఖలకు, మంత్రులుగా ఎంచుకున్నట్టే.. కేసీఆర్ కూడా రాజకీయంగా.. పాలన పరంగా తనకు అనువైన వారినే ఎంచుకుంటారు. వాళ్లు తెలంగాణ వాళ్లు కాకున్నా సరే.. ఈ ప్రాంతంపై అవగాహన లేకున్నా సరే తీసుకుంటారు.. తెలంగాణ సాధించాక.. ఇక్కడి లోకల్ ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు పెద్దపీట వేస్తారని… స్వరాష్ట్రం సాధించుకున్నాక ఇక్కడి ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ బీహార్ కు చెందిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు కేసీఆర్ ప్రాధాన్యమిస్తుండడంతో ఉన్నతాధికారులు ఉడికిపోతున్నారు. వారికి అవగాహన లేకుండా ఉద్యోగుల విషయంలో తీసుకునే నిర్ణయాలు శాపంగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్ ను ఏపీ క్యాడర్ కు కేటాయిస్తూ హైకోర్టు తీర్పునివ్వడం.. కేంద్రం రివీల్ చేయడం జరిగిపోయింది.
ఇక సోమేష్ స్థానంలో కొత్తగా తెలంగాణ ప్రభుత్వం సీఎస్ గా శాంతికుమారికి అవకాశం దక్కింది. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం.. ఆమె బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయింది. 2025 ఏప్రిల్ వరకూ ఆమె పదవిలో ఉంనున్నారు. గతంలో తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఈమె తెలంగాణ సీఎంవో కీలక అధికారిగా.. కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు అవకాశం దక్కించుకున్నారు. -ఎవరీ శాంతికుమారి? ఎలా కేసీఆర్ ఎంచుకున్నారు.? తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి రికార్డు సృష్టించారు. శాంతికుమారి 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. శాంతికుమారి వైద్యారోగ్య శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. 2014లో కేసీఆర్ తొలి సీఎం అయ్యాక సీఎంవోలో కీలక పాత్ర పోషించారు. స్పెషల్ ఛేజింగ్ సెల్ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు. కేసీఆర్ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్ గానూ ఆయనకు సహకరించారు. నాలుగేళ్లపాటు సీఎంవోలో ప్రిన్సిపల్ సెక్రటరీగా.. టీఎస్ ఐపాస్ లో పనిచేశారు.
