Latest Posts

మావోయిస్టు పార్టీకి భారీ నష్టం

బీజాపూర్‌-తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మిలిటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరొందిన మావోయిస్టు నేత మడావి హిడ్మా మృతిచెందినట్లు సమాచారం.ఈ దాడిలో మిలిటరీ హెలికాప్టర్ ను వినియోగించినట్టు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్‌ కోబ్రా ఆధ్వర్యంలో గ్రేహౌండ్స్‌ నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో మడావి హిడ్మా మృతి చెందినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .ఐతే, ఈ సంఘటనను బస్తర్ ఐ జి సుందర్రాజ్. పి ధ్రువీకరించడం లేదు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, భద్రతా బలగాలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా ఉన్న మడావి హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. బీజాపూర్‌-తెలంగాణ సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్‌ కోబ్రా ఆధ్వర్యంలో జరిపిన గ్రేహాండ్స్‌ ఆపరేషన్‌లో ఈ ఘటన జరిగినట్టు సమాచారం . ఈ ఎన్‌కౌంటర్‌లోనే హిడ్మా హతమైనట్లు తెలుస్తోంది. దండకారణ్యంలో ఎంతోమంది పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాల మరణాలకు హిడ్మా కారణమయ్యాడు. ఇతనికి ‘మందుపాతరల మాస్టర్ మైండ్’అనే పేరుంది. భద్రతా బలగాలపై దాడికి స్కెచ్ వేసిండంటే ఇతని బారినుంచి తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యమనే చెప్తుంటారు. ఇతని దాడుల్లోనే భద్రతా బలగాలకు భారీఎత్తున ప్రాణనష్టం జరిగింది. అందుకే ఇతన్ని టార్గెట్ చేసి 10ఏళ్ల క్రితం నుంచే భద్రతా బలగాలు పెద్దఎత్తున వేటడుతున్నాయి.

పదేళ్ల క్రితమే ఇతని తలపై 75లక్షల రివార్డు ఉంది.17ఏళ్లకే మావోయిస్టు పార్టీలో చేరిన హిడ్మాది దక్షిణ బస్తర్‌ ప్రాంతంలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం. 7వ తరగతి వరకే చదివిన హిడ్మా ఇంగ్లీష్‌లో అలవోకగా మాట్లాడడం గమనార్హం. 1996-97లో పార్టీలో చేరిన ఈ సీనియర్‌ మావోయిస్టు 2000లో దక్షిణ బస్తర్‌ జిల్లా ప్లటూన్‌ కు కీలక సభ్యుడిగా, ఆ తర్వాత మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్‌జీఏలో కీలక సభ్యుడుగా ఎదిగాడు . 2007 లో ఉర్పల్‌లో సీఆర్పీఎఫ్‌ వాహనంపై జరిగిన దాడిలో 24మంది మృతి చెందారు. ఈ దాడికి హిడ్మానే కారణమనే ప్రచారం జరిగింది. అప్పటివరకు మందుపాతరలనే నమ్ముకున్న మావోయిస్టులు తుపాకుల వైపు మళ్లడంలో హిడ్మాది కీలకపాత్ర. తుపాకులను వాడడంలో, మందుపాతరలను తయారు చేసి పేల్చడంలో, అమర్చడంలో హిడ్మాను పార్టీ స్పెషలిస్ట్‌ గా భావిస్తుంటారు . 2010 తాడిమెట్ల ఘటనలో 76మంది పోలీసులు, 2017 మార్చిలో 12మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు మృతి చెందిన ఘటనల్లోనూ హిడ్మా పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల సుక్మా-బీజాపూర్‌ సరిహద్దుల్లోని టెర్రాం వద్ద మావోయిస్టులు వ్యూహాత్మకంగా జరిపిన దాడిలోనూ 24మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కూడా హిడ్మా కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. వీటితో పాటు ఆపరేషన్లలో హిడ్మా ప్రత్యక్షంగా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.

Editor