ఢిల్లీ, ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్లోని అనేక ఆసుపత్రులు ప్రస్తుతం రోగులతో కిక్కిరిసిపోతున్నాయి.
ఓపీడీలు మొత్తం వైరల్ ఫీవర్ కేసులతో నిండి ఉన్నాయి. ప్రజలు సాధారణ ఫ్లూ లాంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. కొందరికి అయితే వారం అయినా జ్వరం అస్సలు తగ్గడం లేదు. దాంతో కరోనా వైరస్ సోకిందా అని వైద్యులు టెస్ట్ చేస్తే.. కొత్త వైరస్ బయటికొచ్చింది. ఆ వైరస్ పేరే ‘హెచ్3ఎన్2’ (H3N2 Virus).
హెచ్3ఎన్2 వైరస్ సోకిన వారిలో అచ్చు కరోనా లక్షణాలే ఉన్నాయి. అయితే టెస్ట్ చేస్తే మాత్రం కరోనా పాజిటివ్ మాత్రం రావడం లేదు. ముఖ్యంగా వృద్ధులు మరియు పిల్లలను ప్రభావితం చేసే ఈ జ్వరానికి చికిత్స ఏమిటో తెలుసుకోవడానికి పేషేంట్స్ నమూనాలను వైద్యులు టెస్టింగ్ ల్యాబ్కు పంపుతున్నారు. 10 నమూనాలలో ఆరింటికి హెచ్3ఎన్2 పాసిటివ్ (H3N2 POSITIVE) ఉన్నట్లు తేలింది.
స్టార్ ఇమేజింగ్ ల్యాబ్కు చెందిన సమీర్ భాటి తెలిపిన వివరాల ప్రకారం… ఆసుపత్రులకు వచ్చే వారికి తీవ్ర జ్వరం ఉంటుందట. వారం గడిచినా జ్వరం తగ్గడం లేదట. దాంతో వైద్యులు గందరగోళంకు గురై కరోనా వైరస్ టెస్టులు చేస్తున్నారట. ఆపై హెచ్3ఎన్2 టెస్ట్ చేస్తున్నారట. మైక్రోబయాలజీ నిపుణుడు డాక్టర్ సోనికా ప్రకారం.. హెచ్3ఎన్2 టెస్ట్ కూడా కరోనా మాదిరిగానే ఉంటుందట. గొంతు మరియు ముక్కు నుంచి నమూనాలను తీసుకుంటారు. ఈ నివేదిక 24 గంటల్లో వస్తుంది.
రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
# జ్వరానికి పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకోవచ్చు.
# బాగా విశ్రాంతి తీసుకోవాలి.
# ద్రవాలు (పండ్ల రసాలు) నిత్యం తీసుకుంటుండాలి.
# చలికాలంలో వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.
# చిన్న పిల్లలు, 50 ఏళ్లు పైబడిన వారు మరియు గర్భిణీ స్త్రీలు తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి.
