Latest Posts

దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుంది కాంగ్రెస్ వ్యవహారం..

పార్టీకి మూల స్థంభాలు పోలింగ్ బూత్ కమిటీలే అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. పోలింగ్ బూత్ కమిటీల ద్వారా మాత్రమే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర కార్యలయంలో జరిగిన పోలింగ్ బూత్ కమిటీల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కార్యకర్తలను అనుసంధానించడమే లక్ష్యంగా సరళ్ యాప్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఎప్పటికప్పుడు సరళ్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. కార్యకర్తల కష్టాన్ని నేరుగా జాతీయ నాయకత్వం గుర్తించి తగిన అవకాశాలు కల్పించేందుకు ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బండి సంజయ్. తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ నేతలు కేంద్ర నిధులపై డ్రామా చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు. బీజేపీ కార్యకర్తల కష్టార్జితంవల్లే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ సహా అనేక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 22 నోటిఫికేషన్లు ఇచ్చిందే తప్ప.. ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలున్నప్పటికీ నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తోందన్నారు.

మళ్లీ కోర్టులకు పోయి ఉద్యోగాలు భర్తీ కాకుండా బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఒక్కరోజే 75 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానిదేనని అన్నారు. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ మొదలైందన్నారు. ‘తెలంగాణలో ప్రజలు కష్టాల్లో ఉన్నరు.. ఆసరా పెన్షన్లు మినహా టీఆర్ఎస్ ప్రజల కోసం చేసిందేమీ లేదు. రైతు బంధు సొమ్మును బ్యాంకులు రుణమాఫీ కింద జమ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. లిక్కర్ ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తోంది. పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం ఖర్చులు పోగా ఇంకా రూ.10 వేల కోట్ల ఆదాయం మిగులుతోంది. ఆ సొమ్ము ఎటు పోతోంది..? ఆ వివరాలెందుకు వెల్లడించడం లేదు..? కేంద్రాన్ని బదనాం చేయడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుంది. పేదల కోసం బీజేపీ అధికారంలోకి రావాలి. రజాకార్ల రాజ్యానికి చరమ గీతం పాడదాం. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుతున్నారు.. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుంది కాంగ్రెస్ నేతల వ్యవహారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరి ఏండ్లు గడిచినా ఇప్పటి వరకు నోరు మెదపని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదం. జనం కాంగ్రెస్‌ను చూసి నవ్వుకుంటున్నారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం. కలిసే పోటీ చేయబోతున్నరు. వాస్తవాలు ప్రజలకు తెలియడంతో దారి మళ్లించేందుకే కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు పేరుతో డ్రామాలాడుతున్నరు.

Editor