Latest Posts

శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్‌!!

కోటానుకోట్ల భక్తుల దేవుడు ఏడుకొండల వెంకన్న. ఆయన దర్శన భాగ్యం కోసం దేశంతోపాటు ప్రపంచ దేశాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించి తరిస్తారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన టీటీడీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు తాజాగా టీటీడీ పాలకవర్గం మరో షాక్‌ ఇచ్చింది. భక్తులకు కేటాయించే కొన్ని వసతి గృహాల అద్దెను భారీగా పెంచింది. ఈ మధ్య కాలంలో వసతి గృహాలను టీటీడీ ఆధునీకరించింది. ఇప్పుడు ఆధునీకరణ కారణంగా అద్దెను పెంచి వసూళ్లు చేస్తోంది. TTD సామాన్యులకు భారం.. తిరుమలకు ధనిక, పేద అని తేడా లేకుండా భక్తులు వస్తారు. దూరం ప్రాంతాల భక్తులు స్వామివారి సన్నిధిలో కనీసం ఒకరోజైనా ఉండాలని భావిస్తారు. ఇందుకోసం స్వామివారి వసది గదులను ఆశ్రయిస్తారు. అవి దొరకడమే గగనంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో టీటీడీ వాటి అద్దెను భారీగా పెంచింది. సామాన్య..మధ్యతరగతి ప్రజలకు ఇది షాకింగ్‌. తిరుమల వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాల కోసం ఆధునీకరించారు. ఇందుకోసం రూ.100 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. పనులు ప్రారంభించారు. కొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయి.

ఆధునీకరణ పూర్తయిన వసతి గృహాల్లో ధరలు పెంచారు. ఒకేసారి రెట్టింపు.. ఆధునికీకరణకు భారీగా ఖర్చు చేశాం కాబట్టి ఆమొత్తం ఒకే ఏడాదిలో రాబట్టాలన్నట్లుగా ఉంది టీటీడీ తీరు. గదుల ఆధునికీకరణ భారం మొత్తాన్ని భక్తులపైనే వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా గదుల అద్దెను రెట్టింపు చేసింది. తిరుమలలో భక్తుల కోసం దాదాపుగా 6 వేల గ దులు ఉన్నాయి. తిరుమల నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల్లో అద్దెను పెంచి వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వసతి గృహాల్లో రూ 500, రూ.600 గా ఉన్న అద్దెను ఏకంగా రూ.1000కి పెంచారు. రెస్ట్‌హౌస్‌ భారం ఘోరం.. ఈ నెల 1వ తేదీ నుంచి నారాయణగిరి రెస్ట్‌ హౌస్‌లోని 1, 2, 3 గదుల అద్దెను రూ.750 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1,700 కి పెంచారు. నారాయణగిరి రెస్ట్‌ హౌస్‌ 4లో ఒక్కో గదిని రూ. 750 నుంచి రూ 1,750కి పెంచేశారు. కార్నర్‌ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ.200కు పెంచారు. స్పెషల్‌ టైపు కాటేజీల్లో రూ.750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ.2,800 చేశారు. అద్దెతో పాటు డిపాజిట్‌ చెల్లింపు భక్తులు గదుల అద్దెతోపాటుగా డిపాజిట్‌ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం కారణంగా గది అద్దెకు రూ. 1700 అయితే, డిపాజిట్‌ నగదుతో కలిపి రూ.3,400 చెల్లించాల్సి ఉంటుంది. వసతి గృహాల ధరలను పెంచుతూ టీటీడీ తీసుకున్న నిర్ణయం సామాన్య భక్తులకు భారంగా మారుతోంది. ధరల పెంపుపై పునరాలోచన చేయాలని భక్తులు కోరుతున్నారు.

Posted Under AP
Editor