అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలచివేస్తోంది. ఉటా రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది చనిపోయారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి అమెరికా అధికారులు పూర్తి సమాచారం వెల్లడించాల్సి ఉంది. ఎవరు కాల్పులు జరిపారు..? ఎందుకు కాల్పులు జరిపారు..? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు 8 వేల జనాభా ఉన్న ఉటా పట్టణంలో ఈ ఘటనతో నగరమంతా భయాందోళనలు నెలకొన్నాయి. ఉటాలోని గ్రామీణ ప్రాంతంలోని ఓ ఇంటిలో ఎనిమిది మంది మృతదేహాలు కనిపించాయని స్థానిక అధికారులు తెలిపారు. వీరిని గుర్తు తెలియని వ్యక్తు కాల్చి హత్య చేశారని చెప్పారు. మృతుల్లో ముగ్గురు పెద్దలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుందన్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు.
త్వరలో నిందితులను పట్టుకుంటామని స్ఫష్టంచేశారు. 130 మంది మృతి అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది మొదటి మూడు రోజుల్లోనే కాల్పుల్లో 130 మందికి పైగా మరణించగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. ‘గన్ వయలెన్స్ ఆర్కైవ్’ అనే స్వచ్ఛంద సంస్థ మంగళవారం విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో మంగళవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఒక చిన్నారి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని, దాడి చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ రాబర్ట్ కాంటి తెలిపారు. క్రిస్మస్ ముందు కాల్పులు క్రిస్మస్కు ముందు కూడా అమెరికాలోని మాల్లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. నార్డ్స్ట్రోమ్ డిపార్ట్మెంట్ స్టోర్లో కాల్పులు జరిగాయి. కాల్పులు ముగిసే వరకు మాల్కు దాదాపు 45 నిమిషాల పాటు తాళం వేశారు. ఆ తర్వాత దుకాణదారులను ఇంటికి వెళ్లాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మాల్ ఆఫ్ అమెరికా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
