Latest Posts

చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ సపోర్ట్.. సీఎం జగన్‌పై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, సభలు నిషేధించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. బుధవారం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కుప్పంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు లాఠీఛార్జి చేశారు. రోడ్‌ షోలకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు నిలిపివేయడంతో దాదాపు ఆయన గంటపాటు రోడ్డుపైనే ఉన్నారు. దీంతో మైక్ పట్టుకుని అక్కడే ప్రసంగించారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకోవడంపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నానని అన్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు.. ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో 1ని తీసుకువచ్చారని విమర్శించారు. ఇటువంటి జీవో గతంలో ఉండి ఉంటే జగన్‌ రెడ్డి నాడు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా..? అని ప్రశ్నించారు.

ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజా పక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా తమ బాధ్యత అని జనసేనాని అన్నారు. ఇలాంటి చీకటి ఉత్త్వరులు ఇవ్వకుండానే అందులోని దురుద్దేశాలను విశాఖ నగరంలో అక్టోబరులోనే వెల్లడించారని గుర్తు చేశారు. వాహనంలో నుంచి కనిపించకూడదు.. ప్రజలకు అభివాదం చేయకూడదని, హోటల్‌ నుంచి బయటకు రాకూడదని నిర్బంధాలు విధించారని మండిపడ్డారు. ఇప్పటం వెళ్లరాదని అటకాయించారని అన్నారు. ‘ఆ పెడ పోకడలనే అక్షరాల్లో ఉంచి జీవో ఇచ్చారు. ఈ ఉత్తర్వులు బూచిగా చూపి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాను. ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. చంద్రబాబు గారు ఎమ్మెల్యేగా తన నియోజక వర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి. ఆయన విధులను జీవో 1 ద్వారా అడ్డుకొంటున్నారా..? ఈ ఉత్తర్వులు జగన్‌ రెడ్డి గారికి వర్తిస్తాయా..? లేవా..? నిన్నటి రోజున రాజమహేంద్రవరంలో జనాన్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి ఆయన చేసిన షో ఈ ఉత్తర్వుల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందో రాదో పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలి. చీకటి జీవోలతో రాష్ట్రంలో క్రమంగా నియంతృత్వం తీసుకువస్తున్న పాలకుల విధానాలను ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలి..’ అని పవన్ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు.

Posted Under AP
Editor