ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: మంత్రి పయ్యావుల కేశవ్

ఉరవకొండ, జూలై 3: ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రెండో రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ నిర్వహించారు. జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను స్వీకరించారు.
ప్రతి అర్జీని పరిశీలించిన మంత్రి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్జీల పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor