లాక్‌డౌన్ అంటూ వదంతులు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!

దేశాన్ని మరోసారి కొత్త వైరస్ భయపెడుతోంది. చైనాలో ప్రారంభమైన ‘హ్యూమన్ మెటాన్యూమో వైరస్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. సోమవారం ఆయా రాష్ట్రాల్లో ఆరు కేసులు నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ వైరస్ చిన్న పిల్లలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడులో నమోదైన కేసుల్లో చిన్న పిల్లలే ఉండడం విశేషం.

 

అయితే ఈ కొత్త వైరస్‌పై కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తు్న్నారు. పనిగట్టుకుని లేనిపోని భయాలు సృష్టిస్తున్నారు. మళ్లీ దేశంలో లాక్‌డౌన్ అంటూ లేనిపోని వార్తలు సృష్టిస్తున్నారు. జనాలను కరోనా తరహాలో హడలెత్తిస్తున్నారు. వైరస్ వార్తలు రావడంతో సోషల్ మీడియాలో లాక్‌డౌన్ అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. దీంతో ప్రస్తుతం లాక్‌డౌన్ వార్త ట్రెండింగ్‌గా నిలిచింది.

 

తాజాగా లాక్‌డౌన్‌ ట్రెండింగ్ వార్తలపై కేంద్రం స్పందించింది. అలాంటి వదంతులు నమ్మొద్దని కొట్టిపారేసింది. సోషల్ మీడియా వేదికగా తప్పుడ వార్తలు పుట్టించొద్దని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. కొత్త వైరస్‌ కొత్తదేమీ కాదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. చాలా ఏళ్లుగా ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని.. గాలి, శ్వాస ప్రక్రియ ద్వారా విస్తరిస్తోందని చెప్పారు. అన్ని వయసుల వారిపై వైరస్ ప్రభావం ఉంటుందని పేర్కొంది. శీతాకాలంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని.. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని నడ్డా తెలిపారు.

Editor