Latest Posts

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పమార్పు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది సీబీఎస్ఈ బోర్డు. సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి మార్చ్ 21 వరకూ కొనసాగనున్నాయి. ఇక 12వ తరగతి పరీక్షలు ఫిభ్రవరి 15 వ తేదీన ప్రారంభమై..ఏప్రిల్ 5 వరకూ జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం 10.30 నిమిషాల్నించి 1.30 నిమిషాలవరకూ పరీక్షలు జరగనున్నాయి. రెండు సబ్జెక్టుల మధ్య గ్యాప్ ఇవ్వడమే కాకుండా జేఈఈ మెయిన్స్ పరీక్షల్ని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ షెడ్యూల్ రూపొందించింది. ఈ క్రమంలోనే 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో చిన్న మార్పు చేసింది.

ఏప్రిల్ 4న జరగాల్సి న పరీక్షను మార్చ్ 27నే నిర్వహించనుంది. మిగిలిన టైమ్ టేబుల్ యధాతధంగా ఉంటుంది. ఏ రెండు సబ్జెక్టుల కూడా ఒకే రోజు రాకుండా ఉండేందుకే ఈ మార్పు చేసినట్టు సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. సీబీఎస్ఈ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలో ఉన్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సైతం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 15 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 4 వరకూ జరగనున్నాయి. పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 వరకూ జరగనున్నాయి. ఇక తెలంగాణలో సైతం పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 18 వరకూ జరుగుతాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా తెలంగాణలో మార్చ్ 15 నుంచే ప్రారంభమై..ఏప్రిల్ 4 వరకూ జరగనున్నాయి.

Editor