Latest Posts

తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ బి బాలముకుందరావు వర్సెస్ హైకోర్టు ఘటన

సాధారణంగా చాలామంది న్యాయమూర్తులు అతీతులు అనుకుంటారు. వాస్తవానికి న్యాయమూర్తులెవరూ దివి నుంచి దిగిరారు. న్యాయవాది ఏ రాజ్యాంగాన్ని చదువుతాడో న్యాయమూర్తి అదే రాజ్యాంగాన్ని అనుసరిస్తాడు.

ఈ విషయం ఆ న్యాయవాదికి బాగానే తెలుసనుకుంటా.

తెలంగాణ హైకోర్టులో రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కుక్క మనిషిని కరవడం సహజమే. కానీ ఆ మనిషే కుక్కను కరిస్తే ఆశ్చర్యమే కదా. అటువంటిదే ఈ ఘటన. న్యాయమూర్తి..న్యాయవాదికో లేదా పిటీషనర్లకో లేదా ప్రతివాదులకో నోటీసులు పంపించడం సహజమే. కానీ న్యాయవాదే నిండు న్యాయస్థానంలో న్యాయమూర్తికి నోటీసులు పంపిస్తే ఎలా ఉంటుంది. ఊహకే అందడం లేదు కదూ..అదే జరిగింది.

తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ బి బాలముకుందరావు వర్సెస్ హైకోర్టు ఘటన ఇది. ఓ కేసులో భాగంగా బాలముకుందారావు వాదిస్తూ..హైకోర్టు, ఎపెక్స్ కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ఉదహరించాడు. అయితే ఆ కేసును విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు ఆ తీర్పుల్ని అనుసరించేందుకు నిరాకరించారు. దాంతో ఆ అడ్వకేట్ చాలా నొచ్చుకుని..ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికి నోటీసు పంపించాడు. కోర్టు తీర్పుల్ని తిరస్కరించడమే కాకుండా కేసు విచారణ సందర్భంగా ఇతర కోర్టుల్లో జరిగినట్టే అసంబద్ధమైన ప్రశ్నలు వేసి న్యాయమూర్తి తనను అగౌరవపరిచారని ఆ న్యాయవాది ఆరోపించారు. ఈ నోటీసుకు సదరు న్యాయమూర్తి వారం రోజుల్లోగా స్పందించకపోతే తగిన చర్యలు తీసుకుంటానని చెప్పడం విశేషం.

లీగల్ నోటీసు ద్వారా న్యాయమూర్తినే ప్రశ్నించిన ఘటనను తెలంగాణ హైకోర్డు ఛీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయన్, జస్టిస్ సివి భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. అడ్వకేట్ బాలముకుందరావుపై కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జనవరి 30న జరగనుంది.

Editor