ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత జట్టు సెమీస్లో ఓడి మరోసారి నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అయితే అంధుల ప్రపంచకప్లో మాత్రం భారత్ విజయం సాధించింది. భారత అంధుల జట్టు వరుసగా మూడో సారి విశ్వవిజేతగా నిలిచింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్లో విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది. బంగ్లాపై 120 పరుగుల భారీ తేడాతో గెలిచి హ్యాట్రిక్ వరల్డ్ కప్ను సొంతం చేసుకుంది. ఫలితంగా అత్యంత విజయవంతమైన క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 277 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత ఆటగాడు సునీల్ రమేష్(63 బంతుల్లో 136*) సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి కూడా (50 బంతుల్లో 100*) శతకంతో విజృంభించాడు. ఫలితంగా మైదానంలో పరుగుల వరద పారింది. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన వీరు ఆ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ మూడో వికెట్కు 247 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
అనంతరం లక్ష్య ఛేధనలో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేసి బంగ్లాను 157 పరుగులకే పరిమితం చేశారు. ఆరంభం నుంచే నిదానంగా సాగిన బంగ్లాదేశ్.. భారీ లక్ష్యాన్ని ఛేధించలేక ఓటమిపాలైంది. 29 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరకు 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో లలిత్ మీనా, అజయ్ కుమార్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అంధుల టీ20 ప్రపంచకప్ మొదటి సారి 2012లో నిర్వహించగా.. ఆరంభ టోర్నీలోనే భారత్ విజేతగా నిలిచింది. అనంతరం ఐదేళ్ల తర్వాత 2017లోనూ తన విజయాల పరంపరను కొనసాగిస్తూ రెండో సారి విశ్వవిజేతగా నిలిచింది. తాజాగా 2022లోనూ మూడో సారి గెలిచి తనకు తిరుగులేదని నిరూపించింది. ఈ విధంగా హ్యాట్రిక్ విజయాలతో అత్యంత సక్సెస్ఫుల్ ఇండియన్ క్రికెట్ జట్టుగా రికార్డు సృష్టించింది.
