వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ అడుగులు వేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు గురించి ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్క్షాపు నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసిన సీఎం జగన్.. పలువురు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సక్రమంగా పాల్గొనని 32 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కొందరు ఎమ్మెల్యేలు సరిగా పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు యాక్టివ్ అవుతున్నాయని.. అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇంఛార్జులకు సూచించారు. ఏప్రిల్ వరకు అసంతృప్తి ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సమయం ఇచ్చినట్లు సమాచారం. ఆలోపు పనితీరు మెరుగుపర్చుకోకపోతే.. సిట్టింగ్లను మార్చే అవకాశం ఉంటుందని హెచ్చరించినట్లు తెలిసింది. కొంతమంది ఎమ్మెల్యేలు కేవలం రెండు గంటలు మాత్రమే గ్రామ సచివాలయంలో ఉంటున్నారని..
ఈ పరిస్థితి మారాలని చెప్పారు. రాష్ట్రంలో పేదవారికి పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని.. 32 మంది ఎమ్మెల్యేలు బాగా తిరగాలని స్పష్టం చేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల మేలును ప్రజలకు వివరించాలని సూచించారు సీఎం జగన్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై అలసత్వం వహించవద్దని సూచించారు. మార్చి నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తక్కువ రోజులు చేసిన వారు సరి చూసుకోవాలని చెప్పారు. మార్చి తరువాత కొత్త నివేదిక తెప్పించుంటున్నానని.. ఆలోపు పనితీరులో మార్పు ఉండాలన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని తన లేదని.. కానీ కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా మంత్రుల తీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు గుమ్మనూరు జయరాం, విడదల రజని, జోగి రమేష్, సిదిరి అప్పల్ రాజు, గుడివాడ అమరనాథ్పై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది.
