Latest Posts

ఉమ్మడి ఆస్థుల పంచాయితీ ఇక సుప్రీంకోర్టులో, పిటీషన్ దాఖలు చేసిన AP

తెలుగు రాష్ట్రాల విభజన జరిగి అప్పుడే 8 ఏళ్లైంది. ఇప్పటికీ ఉమ్మడి ఆస్థుల విభజన జరగలేదు. ఈ విషయంపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉమ్మడి ఆస్థులు పంపిణీ చేయాలని కోరింది. రాష్ట్ర విభజన, ఉమ్మడి ఆస్థుల విషయమై ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వైఖరికి నిరసనగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అయినా ఇంకా ఉమ్మడి ఆస్థుల పంపిణీ జరగలేదని సుప్రీంకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. ఈ ఉమ్మడి ఆస్థుల విలువ 1, 42, 601 కోట్లు ఉందని ఏపీ వెల్లడించింది.

ఇప్పటికీ విభజించాల్సిన ఆస్థులు 91 శాతం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,21 ప్రకారం ఏపీ ప్రజల హక్కులకు తెలంగాణ ప్రభుత్వం భంగం కల్గించిందని ఏపీ ప్రభుత్వం పిటీషన్‌లో తెలిపింది. ఇప్పటికే విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. విభజన ప్రకారం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు 3,441 కోట్లున్నాయి. 2017 జూన్ నాటికి 2,841 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉందని పిటీషన్‌లో తెలిపింది.

ప్రస్తుతం ఈ వివాదం తెలంగాణ హైకోర్టులో ఉంది. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం మొత్తం ఆస్థుల విభజన జరగాల్సి ఉంది. ఇవి జరగకపోవడంతో ఇప్పటికీ సింహభాగం ఆస్థులు తెలంగాణలోనే ఉన్నాయి. గతంలోనే ఉన్నత విద్యామండలి విషయంలో ఆస్థుల్ని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఉమ్మడి ఆస్థులకు ఈ తీర్పు వర్తిస్తుందని కూడా వెల్లడించింది. అయినా ఇప్పటి వరకూ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టైనా ఈ సమస్యకు పరిష్కారం సూచిస్తుందా లేదా చూడాలి.

Posted Under AP
Editor