Latest Posts

బీజేపీ నుంచి మరోసారి నోట్ల విషయంపై వివాదం

ఇప్పుడు బీజేపీ నుంచి మరోసారి నోట్ల విషయంపై వివాదం ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ రాజ్యసభలో 2 వేల రూపాయల నోటును రద్దు చేయాలంటూ డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాలు మీ కోసం.. 2000 రూపాయల నోటును అక్రమ వ్యాపారం, నేరాల్లో అధికంగా వాడుతున్నందున..తక్షణం వీటిని ప్రభుత్వం రద్దు చేయాలని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కమార్ మోదీ రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మార్కెట్‌లో పింక్ కలర్ 2000 రూపాయల నోటు కన్పించడం కష్టమైపోయిందన్నారు. ఏటీఎంలో కూడా 2 వేల రూపాయల నోటు అందుబాటులో లేదని..రద్దు చేశారనే పుకార్లు వస్తున్నాయని సుశీల్ కుమార్ మోదీ చెప్పారు.

2016లో నోట్ల రద్దు మోదీ ప్రభుత్వం 2016 నవంబర్ 8వ తేదీన నోట్ల రద్దు ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తూ..వాడకాన్ని నిషేధించారు. ఆ తరువాత కొద్దిరోజుల అనంతరం కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను విడుదల చేసింది. గత ముూడేళ్ల నుంచి ఆర్బీఐ 2 వేల రూపాయల నోటును ముద్రించడం నిలిపివేసిందని బీజేపీ నేత వాదనగా ఉంది. అదే సమయంలో పెద్దమొత్తంలో నకిలీ 2 వేల రూపాయల నోట్లు స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. ప్రజలు పెద్దఎత్తున 2 వేల రూపాయల నోట్లను సేకరించారని సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. కేవలం అక్రమ వ్యాపారాల్లోనే వీటిని ఉపయోగిస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌లో కూడా లభ్యమౌతుందన్నారు. మాదకద్రవ్యాలు, మనీ లాండరింగ్, టెర్రర్ ఫండింగ్ సహా చాలా నేరాల్లో ఈ నోట్లను పెద్దఎత్తున వినియోగిస్తున్నారన్ని చెప్పారు. ప్రపంచంలోని చాలా ఆధునిక ఆర్ధిక వ్యవస్థల్లో పెద్ద నోట్ల వాడకం లేదన్నారు.

అమెరికాలో అత్యధికంగా 100 డాలర్లు ఉందన్నారు. కనీసం వేయి డాలర్ల నోటు కూడా లేదని చెప్పారు. చైనా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్‌లో నోట్ల అత్యధిక విలువ 200 మాత్రమేనన్నారు. కేవలం పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశా్లోనే 5000 రూపాయల నోటు సైతం ఉందన్నారు. అదే ఇండోనేషియాలో 1 లక్ష రూపాయల నోటు కూడా ఉందని సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఇండియాలో 2 వేల రూపాయల నోటు నిర్వహణలో అర్ధం లేదన్నారు. ఇప్పుడైతే ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహిస్తోందని..అందుకే క్రమం క్రమంగా 2 వేల రూపాయల నోటును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 1-2 ఏళ్లలో 2 వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు సమయం ఇవ్వాలన్నారు.

Editor