Latest Posts

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా గంటా చేరికకు గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ మారబోతున్నారని.. అధికార వైసీపీ చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా గంటా చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ముహుర్తం కూడా ఖారారు అయిందని రూమర్లు వచ్చాయి. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ గంటా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చేశారు. తాను మరో పార్టీలో చేరుతాను అన్నది ప్రచారమేనని కొట్టిపారేశారు గంటా శ్రీనివాసరావు. మీడియానే మూర్తాలు పెట్టి, తేదీలు ఖరారు చేస్తోందన్నారు. తాను ఎప్పుడైన పార్టీ మారుతానని చెప్పానా..? అని ప్రశ్నించారు.

తన ప్రమేయం లేకుండానే అంతా మీడియానే ప్రచారం చేస్తోందన్నారు. ఎప్పుడైనా పార్టీ మారే ఆలోచన ఉంటే తానే చెబుతానని అన్నారు. రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయని.. రెండే కాదన్నారు. ‘కాపునాడు బహిరంగ సభకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానిస్తాం. బడుగు,బలహీన వర్గాలకు ఆశాజ్యోతి వంగవీటి రంగా. అంబేడ్కర్ వంటి మహనీయులు తర్వాత దేశంలో ఎక్కువ విగ్రహాలు ఉండేవి వంగవీటి రంగావే. రంగా ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం. కాపునాడు బహిరంగ సభ లక్ష్యం ఎంటో రానున్న కాలంలో స్పష్టత వస్తుంది..’ అని గంటా శ్రీనివాసరావు తెలిపారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానం నుంచి గంటా శ్రీనివాసరావు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.

అయితే ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటూ.. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా పర్యటనకు వచ్చినా.. గంటా మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయన పార్టీని వీడుతున్నారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. కానీ మళ్లీ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ యాక్టివ్ అయ్యారు. ఇటీవల మళ్లీ తెలుగుదేశానికి దూరంగా ఉండడంతో గంటా పార్టీ మారటం ఖాయమని పది రోజుల క్రితం ప్రచారం ఊపందుకుంది. ఆయన తెలుగుదేశం పార్టీని వీడటం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. వైసీపీ పెద్దలతో ఆయన చర్చలు జరిపారని.. ఎమ్మెల్యే టికెట్ కూడా ఖరారు అయిందని రూమర్లు బయటకు వచ్చాయి. అయితే అదంతా ఒట్టి ప్రచారమేనని గంటా శ్రీనివాసరావు కొట్టిపారేశారు.

Posted Under AP
Editor