గుజరాత్‌లో AAPకు ఫిరాయింపు

గుజరాత్‌లో తొలి ప్రయత్నంలోనే 13 శాతం ఓటింగ్ దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకు అప్పుడే ఫిరాయింపు బెడద ప్రారంభమైంది. గెలిచిన మూడోరోజే ఆ ఎమ్మెల్యే జంపింగ్ జపాంగ్ మంత్రం జపిస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే ఎవరు, కారణాలేంటి.. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ఎన్నికల్లో పరాజయం చెందినా..13 శాతం ఓటింగ్ దక్కించుకుంది. మరోవైపు ఐదు ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుంది. 182 స్థానాలు కలిగిన గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 156 స్థానాల్లో విజయం సాధించగా..17 చోట్ల కాంగ్రెస్, 5 స్థానాల్లో ఆప్ విజయం సాధించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ దేడియా పాడా, విసాబాదర్, జంజోధ్ పూర్, బొటాడ్, గరియాధర్ స్థానాల్ని కైవసం చేసుకుంది.

ఈ స్థానాల్నించి చైతర్ వసావ, భూపత్ భయానీ, హేమంత్ ఖావా, ఉమేశ్ మక్వాణా, సుధీర్ వాఘావిలు విజయం సాధించారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకు 5 మంది ఎమ్మెల్యేలు లభించారనే ఆనందం ఎంతో సేపు నిలవడం లేదు. అప్పుడే ఆ పార్టీకు ఫిరాయింపు బెడద పట్టుకుంది. గెలిచిన ఐదుమందిలో ఒకరు జంపింగ్ జపాంగ్ మంత్రాన్ని జపిస్తున్నాడు. అతడెవరో కాదు..విసాబాదర్ స్థానం నుంచి గెలిచిన భూపత్ భయానీ. గతంలో కాంగ్రెస్‌లో చేసిన ఈయన..బీజేపీలో చేరాడు. అక్కడ టికెట్ లభించే పరిస్థితి లేదని తెలుసుకుని..ఆమ్ ఆద్మీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. మూడు పార్టీలు మారిన వ్యక్తికి మరో పార్టీ మారడం పెద్ద సమస్య కాదు కదా..అందుకే బీజేపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమైపోయాడు. ఆప్ నేతలు మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులో లేడని తెలుస్తోంది. భూపత్ భయానీ నిష్క్రమణ ఖాయమైతే..ఆప్‌కు నలుగురే మిగులుతారు. లేదా భూపత్ భయానీని చూసి ఇంకెవరైనా జంపింగ్ జపాంగ్ అంటారేమో చూడాలి మరి.

Editor