Latest Posts

బీఆర్ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 12న టీఆర్ఎస్ గులాబీ కూలీ, అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణకి వస్తోందని.. కేసు విచారణకు వచ్చే ముందే ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్‌గా మార్చేశారని అన్నారు. బీజేపీ సూచనలతోనే ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్‌కు సహకరించిందన్నారు. కోర్టు ధిక్కరణకి పాల్పడ్డ కేంద్ర ఎన్నికల కమిషన్‌పై లీగల్‌గా ఫైట్ చేస్తామన్నారు. ఈ మధ్య గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయని.. మోదీ ఓటమి గురించి మీడియాలో రాకపోవడం దురదృష్టకరం అని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ ఓటమి పాలైందని.. 15 ఏళ్ల బీజేపీ పాలనను ఢిల్లీ ఓటర్లు తిరస్కరించారన్నారు రేవంత్ రెడ్డి.

హిమాచల్‌లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్‌కు పట్టం కట్టారని.. బీజేపీ అనుకూల మీడియా ఈ వార్తను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇది బీజేపీకి ఘోరమైన ఓటమి అని.. ధరలు పెంచిన మోదీని దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు. ‘టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి కేసీఆర్‌కు తెలంగాణ పేగు బంధం తెగిపోయింది. అది ఆయన ఇష్టం.. ఆయన ఖర్మ. జగన్ ఆత్మ సజ్జల తెలంగాణను ఏపీలో కలపడానికి సహకరిస్తామన్నారు. ఈ వార్తను కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎవరూ స్పందించలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ ఏపీ రాష్ట్రం అని రాసుకున్నారు.

ఇది యథాలాపంగా జరిగింది కాదు. సజ్జల మాట్లాడి 24 గంటలు గడవకముందే ఎన్నికల సంఘం లేఖలో అడ్రస్ ఏపీగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మనుగడను గుర్తించడానికి కూడా కేసీఆర్ అంగీకరించడం లేదు. సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉంది. ఇది పక్కా ప్రణాళికతో జరిగింది. ఇది ప్రజలకు కేసీఆర్ చేస్తున్న ద్రోహం. ఇది నిజంగా తెలంగాణ సమాజానికి బ్లాక్ డే. మేధావులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చడానికే కేసీఆర్‌ను బీజేపీ వాడుకుంటోంది. ఎంఐఎం, ఆప్ పార్టీల్లా జాతీయ స్థాయిలో మూడో పార్టీగా కేసీఆర్‌ను బీజేపీ ఉపయోగించుకోవాలనుకుంటోంది. దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది. టీఆర్‌ఎస్ బీఆర్‌స్‌గా మారడం వెనక కుట్ర దాగుంది. తెలంగాణను, ఆంధ్రాను కలపడానికి మళ్లీ కుట్ర చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. టీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది..’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

Editor