Latest Posts

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రస్తుతానికి వాయుగుండం కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 970 కి.మీ, చెన్నైకి 1020 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించారు. ఇది క్రమంగా పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ బుధవారం సాయంత్రానికి తుఫానుగా బలపడనుందన్నారు. ఎల్లుండి ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర తమిళనాడు-దక్షిణకోస్తా తీరాలకు చేరుకుంటుందన్నారు. ఆ తరువాత 48 గంటలు ఉత్తర తమిళనాడు-దక్షికోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని కొనసాగుతుందని తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఉత్తర తమిళనాడుతోపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాటు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

గురువారం తిరుపతి, నెల్లూరు జిల్లాలో అధిక వర్షాలు ఉండవచ్చని చెబుతున్నారు. 9వ తేదీన చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే 10వ తేదీన కోనసీమ, కాకినాడ, తూర్పు, ప.గో, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, SPR నెల్లూరు జిల్లాలోపై ఈ తుఫాన్ ప్రభావంతో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా పూర్తి సన్నద్ధంగా ఉన్నామన్నారు ఏపీ సీఎస్ డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి. దక్షిణాంధ్ర జిల్లాలు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు సమీప జిల్లాలపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఆయా జిల్లా అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశామని.. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర సేవలు అందించేందుకు 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 10 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

Posted Under AP
Editor