Latest Posts

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన డిసెంబర్ 10న తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జ

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన డిసెంబర్ 10న తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించనున్నారని సమాచారం. ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత స్థలం ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం, దళిత బంధు అమలు లాంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారిన ఈడీ, ఐటీ దాడులు.. సీబీఐ సోదాలపై కూడా కేబినెట్‌ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే సీఎం కేసీఆర్‌ స్పీడ్‌ పెంచారు. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సొంత స్థలం ఉన్న బలహీన వర్గాలకు ‘గృహ నిర్మాణం పథకం’ అమలు చేయనున్నారు. సొంత స్థలం ఉంటే 3 లక్షల రూపాయాలు ప్రభుత్వ సాయం చేయనుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అర్హులను గుర్తించి 15 రోజుల్లోనే నిధులను విడుదల చేయనున్నారట.

ఈ నెల 10న జరిగే కేబినెట్‌ సమావేశంలో ‘గృహ నిర్మాణం పథకం’కు ఆమోదముద్ర వేయనున్నారట. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్‌ ప్రయత్నిస్తుందోని కేసీఆర్‌ సర్కార్‌ మండిపడుతోంది. రుణాల సేకరణకు ఆడుకట్ట వేస్తోందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణాల్లో కోత, పథకాలకు నిధులు ఇవ్వకపోవడం, విభజన హామీలు నెరవేర్చకపోవడం, కృష్ణా జలాల విభజనలో జాప్యం సహా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలపై రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాజకీయ కక్ష సాధింపులకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ వంటి సంస్థలను వాడుకోవడం పైనా చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీలపైనా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.

Editor