Latest Posts

కాంగ్రెస్ నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు కీలక పదవులు.. బీజేపీలో పదవుల జాతర..

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర సంవత్సరాల సమయం ఉన్నా.. బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించింది. ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ మరింత బలం పెంచుకుంటోంది. మరోవైపు ఇటీవలె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో పార్టీని మరింత పటిష్టం చేసుకునేందుకు.. అనేక మంది పెద్ద ముఖాలకు పార్టీలో కీలక పదవులు, బాధ్యతలను కట్టబెట్టింది. కాంగ్రెస్‌కు అన్ని రంగాల్లో అండగా నిలిచిన సీనియర్ నాయకుడు జైవీర్ షెర్గిల్‌ను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా చేసి పార్టీలో పెద్ద బాధ్యతను అప్పగించింది. మూడు నెలల క్రితమే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన షెర్గిల్.. ఆ తరువాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు పార్టీలో కీలక పదవి దక్కింది. ఆయనతో పాటు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, పార్టీపై తిరుగుబాటు వైఖరి ప్రదర్శించిన కాంగ్రెస్ మాజీ నేత సునీల్ జాఖర్ కూడా బీజేపీలో కీలక పదవులు దక్కాయి. వారిద్దరికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు. ఇద్దరు నేతలూ చాలా కాలంగా కాంగ్రెస్‌లో ఉన్నారు. వీరితోపాటు యూపీ మాజీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్‌కు కూడా జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా స్థానం కల్పించారు.

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021 సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీని వీడబోతున్నట్లు స్పష్టమైంది. దాదాపు 40 రోజుల తర్వాత.. 2021 నవంబర్‌లో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. పార్టీ తనను అవమానించిందని అమరీందర్ సింగ్ అప్పట్లో ఆరోపించారు. లోక్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. కానీ ఆయన పార్టీ విజయం సాధించలేదు. అమరీందర్ స్వయంగా పాటియాలా సిటీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అజిత్‌పాల్ సింగ్ కోహ్లీ చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ఓటమిని ఎదుర్కొన్న కొన్ని నెలల తర్వాత తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అమరీందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించి.. సిక్కుల ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మదన్ కౌశిక్ జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానిత సభ్యునిగా నియమితులయ్యారు. వీరితో పాటు ఛత్తీస్‌గఢ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు విష్ణుదేవ్ సాయి, పంజాబ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు మనోరంజన్ కాలియా, అమంజోత్ కౌర్ రామువాలియా, ఎస్.రాణా గుర్మీత్ సింగ్ సోధిలను కూడా జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పదవులు దక్కాయి.

Editor