సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించారు. లింగాల మండలం పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా రూ.4.1 కోట్లతో నిర్మించిన లేక్ వ్యూ రెస్టారెంట్, పార్కును, రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన బోటింగ్, జెట్టీలను ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో పాంటున్ బోటు (15 కెపాసిటీ), డీలక్స్ బోట్ (22 కెపాసిటీ), 6 సీటర్ స్పీడ్ బోట్, 4 సీటర్ స్పీడ్ బోట్లు ఉన్నాయి. అలాగే పర్యాటకుల భద్రతా చర్యల్లో భాగంగా స్టేట్ డిసాస్టర్ రిస్క్యూ (ఎస్డీఆర్) బోట్, ఫైర్ సర్వీస్ బోట్లను, లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు.
అనంతరం లేక్ వ్యూ పాయింట్ వద్ద నుంచి రిజర్వాయర్ అందాలను తిలకించారు. ముందుగా చిత్రావతి రిజర్వాయర్లో పాంటున్ బోటులో ముఖ్యమంత్రి కాసేపు విహరించారు. చిత్రావతి లేక్ వ్యూ ప్రకృతి అందాలను ఆయన తిలకించారు. ముఖ్యమంత్రితో పాటు బోటులో జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ఎస్పీ అన్బు రాజన్, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప విమానాశ్రయం నుంచి బయలుదేరి లింగాల మండలం పార్నపల్లి వద్ద ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు మధ్యాహ్నం 12.53 గంటలకు చేరుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు, నాయకులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
