జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్…. బీఎస్ 4 వాహనాల కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు

బీఎస్ 4 వాహనాల కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. బస్సుల కొనుగోలు కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా ఆయన అనుచరుడి ఆస్థుల్ని ఈడీ ఎటాచ్ చేయడం విశేషం. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డికి చెందిన దివాకర్ రోడ్‌లైన్స్, జఠాదర ఇండస్ట్రీస్‌కు చెందిన 22.10 కోట్ల ఆస్థుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది. జీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జరిగినట్టుగా ఈడీ గుర్తించింది. అశోక్ లేలాండ్ నుంచి తక్కువ ధరకే వాహనాలు కొనుగోలు చేయడం, స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో కొత్త వాహనాలు నడపడం జరిగిందని ఈడీ తెలిపింది. బీఎస్ 4 వాహనాల కుంభకోణంలో 38.36 కోట్ల గోల్‌మాల్ జరిగిందని తెలిపిన ఈడీ…6.31 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లను సీజ్ చేసినట్టు ఈడీ వెల్లడించింది. మరోవైపు 15.79 కోట్ల విలువైన 68 చరాస్థుల్ని సీజ్ చేసింది.

సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్ 3 కేటగరీలో 154 లారీలు కొనుగోలు చేశారు. ఇందులో స్క్రాప్ కింద జటాధర ఇండస్ట్రీస్ పేరుతో 50, గోపాల్ రెడ్డి పేరుతో 104 వాహనాలున్నాయి. బీఎస్-3 వాహనాల్ని కొని..నకిలీ పేర్లతో బీఎస్-4 వాహనాలుగా వాడుకలో తీసుకొచ్చారు. ఆ తరువాత నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించి ఎన్ఓసీ తీసుకున్నారు. అనంతరం 15 రోజుల వ్యవధిలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గడ్‌లో రీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో ఏపీలో 101 వాహనాలు, తెలంగాణలో 33, కర్ణాటకలో 15, తమిళనాడులో 1, ఛత్తీస్‌గఢ్‌లో 1 నడుపుతున్నారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ కోసం కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. కొన్ని రోజులు వాడిన తరువాత ఎన్ఓసీతో ఇతర రాష్ట్రాలకు విక్రయించేశారు. ఇవి కొనుగోలు చేసినవారు మోసపోయామని గుర్తించి ఫిర్యాదు చేయడంతో..నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రికార్డుల్ని పరిశీలించింది. అప్పుడు డొంకంతా బయటపడింది. 2020 జూన్ నెలలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి సహా 23 మందిపై 35 కేసులు నమోదు కాగా..ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యారు.

Posted Under AP
Editor