Latest Posts

హ్యాకర్ల చేతిలో 50 కోట్ల మంది ‘వాట్సాప్‌’ డేటా

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ ‘వాట్సాప్‌’ నుంచి భారీగా డేటా లీక్‌ అయింది. దాదాపుగా 50 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు సమాచారం తెలుస్తోంది. యూఎస్‌, యూకే, ఈజిప్ట్, సౌదీ అరేబియా, భారత్ సహా 84 దేశాల వాట్సాప్‌ వినియోగదారుల మొబైల్ నంబర్లను ఆన్‌లైన్‌లో హ్యాకర్లు అమ్మకానికి ఉంచారు. ఓ హ్యాకింగ్‌ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఫోన్‌ నంబర్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన పెట్టినట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఒకటిగా భావిస్తున్న ఈ వ్యవహారంలో దాదాపు 500 మిలియన్ల వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్ల డేటాబేస్ ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచారు. అత్యధికంగా ఈజిప్టు నుంచి 4.5 కోట్ల మంది డేటా.. అత్యల్పంగా రష్యా నుంచి కోటి మంది వాట్సాప్‌ యూజర్ల నంబర్లు లీకైనట్లు తెలుస్తోంది.

ఒక్కో దేశానికి చెందిన యూజర్ నంబరుకు ఒక్కో ధరతో అమ్మకానికి పెట్టారట. అమెరికా యూజర్ నంబర్ ధర 7వేల డాలర్లు (సుమారు రూ. 5,71,690), యూకే డేటా 2500 డాలర్లు, జర్మనీ డేటా 2వేల డాలర్లుగా ఉన్నట్లు తెలిసింది. భారత దేశంలో 61.62 లక్షల మంది వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు సమాచారం. ఈ నంబర్లను సైబర్‌ నేరగాళ్లు కొనుగోలు చేసుకుని.. ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. భారీగా డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది. డేటా బ్రీచ్‌ ద్వారా సేకరించిన సమాచారంతో ఫిషింగ్ ఎటాక్స్‌ చేసే అవకాశం ఉందట. అందుకే గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్‌, మెసేజ్‌లు వస్తే.. అస్సలు స్పందించొద్దని సైబర్‌ నిపుణులు సూచించారు. మెటాకు చెందిన సంస్థల్లో డేటా బ్రీచ్‌ ఇదే మొదటిసారి మాత్రం కాదు. గత సంవత్సరం 500 మిలియన్లకు పైగా ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. లీకైన డేటాలో ఫోన్ నంబర్లు, వ్యక్తిగత, ఇతర వివరాలు లీకైన సంగతి తెలిసిందే. హ్యాకర్స్ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడంతో మనమే జాగ్రత్తగా ఉండాలి. గుర్తుతెలియని నంబర్లకు దూరంగా ఉండడమే మంచిది.

Editor