ఆంధ్రప్రదేశ్లో రెండో సారి అధికారంలోకి రావాలనుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి.. ఏడాదిన్నర ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను ఇంటింటికీ పంపుతున్న జగన్.. మరోవైపు నియోజకవర్గాల వారీగా క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికలకు తన టీం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. క్షేత్ర స్థాయిలో పార్టీ జిల్లా అధ్యక్షుల నుంచి ప్రాంతీయ సమన్వయకర్తల వరకు మార్పులు చేశారు. సీనియర్లు – ముఖ్యులు అన్న తేడా లేకుండా పనితీరే కొలమానంగా తన టీంలో జగన్ మార్పులు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని.. అనిల్ వంటి వారిని రీజనల్ కోఆర్డినేటర్ల బాధ్యతల నుంచి తప్పించారు. ఎనిమిది జిల్లాల అధ్యక్షులను మార్చారు. ఇందులో కొందరు తమను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కోరగా.. మరి కొందరిని పార్టీ అధినాయకత్వం మార్చింది. CM Jagan Election Team జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకూ మార్పులు.. ఎన్నికలకు సిద్ధం అవుతున్న ముఖ్యమంత్రి ఇందు కోసం తన టీంలో మార్పులు చేశారు. ఎనిమిది మంది జిల్లా అధ్యక్షులను.. ఆరుగురు ప్రాంతీయ సమన్వయ కర్తలను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తన తొలి కేబినెట్లో ఉన్నవారిని తప్పించి వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కేటాయించారు. ఇప్పుడు వారిలోనూ కొందరిని మార్చారు. కొద్ది రోజులుగా వైసీపీలో వరుసగా కొందరు జిల్లా అధ్యక్ష పదవుల నుంచి తప్పుకొనేందుకు ముందుకు వచ్చారు. కొత్త వారిని నియమించేందుకు రూట్ క్లియర్ చేశారు. అయిదుగురు జిల్లాల అధ్యక్షులు ఆ బాధ్యతల నుంచి తమనుఉ తప్పించాలని కోరారు. మిగిలిన ముగ్గురిని పనితీరు ఆధారంగా జగన్ తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో రాజకీయంగా వైసీపీకి కీలకంగా ఉన్న జిల్లాలు ఉన్నాయి.
మాజీ మంత్రలకు షాక్.. కొత్త అధ్యక్షులు అమరావతి ప్రాంత పరిధిలోని గుంటూరు జిల్లాకు ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న మాజీ హోం మంత్రి సుచరిత స్థానంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్కు బాధ్యతలు అప్పగించారు. కుప్పం వైసీపీ అభ్యర్ధిగా ఖరారైన భరత్ను చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనను పూర్తిగా నియోజకవర్గంపైనే ఫోకస్ చేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి అప్పగించారు. ఇక కేబినెట్ విస్తరణలో పదవులు కోల్పోయిన అవంతి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, సుచరిత ఇప్పుడు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కీలకమైన విశాఖ జిల్లా బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్బాబుకు అప్పగించారు. అదే విధంగా పార్వతీపురం మన్యం జిల్లా బాధ్యతలను మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజుకు కేటాయించారు. Kodali Nani, Anil కీలక జిల్లాలకు వైసీపీ అధ్యక్షుల మార్పు.. ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలను బుర్రా మధుసూదనయాదవ్ నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి అప్పగించారు. బాలనాగిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన కర్నూలు జిల్లా అధ్యక్ష పదవిని కర్నూలు మేయర్ బీవై.రామయ్యకు అప్పగించారు. తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తప్పించి దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి తనయుడు రామకుమార్రెడ్డికి కట్టబెట్టారు. రాజకీయంగా కీలకమైన అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను పైలా నరసింహయ్యకు కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల విషయంలోనూ సీఎం జగన్ మార్క్ నిర్ణయం కనిపించింది. ఎన్నికల టీంగా చెప్పుకుంటున్న తాజా నియామకాలతో పనితీరే ప్రామాణికంగా పార్టీలో పదవులు వసస్తాయన్న స్పష్టమైన సంకేతాలు నేతలకు ఇచ్చారు.