మున్సిపల్ ఉద్యోగుల సేవలు అమూల్యమైనవి: ఎమ్మెల్యే కాలవ.
మున్సిపల్ ఉద్యోగులు తమ సుదీర్ఘ సర్వీసులో ప్రభుత్వానికి, ప్రజలకు అందించిన సేవలు ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే కాలవ పేర్కొన్నారు. మున్సిపల్ ఉద్యోగుల పదవీ విరమణ సందర్భంగా మంగళవారం రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దశాబ్దాల పాటు ప్రభుత్వ కొలువులో ప్రజా సేవచేసి పదవీ విరమణ పొందటం అన్నది కాస్త సంతోషం, కాస్త బాధతో కూడుకొన్న విషయమన్నారు. ఇకపై తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా గడపాల్సి రావడం ఒక రకంగా అదృష్టమన్నారు. ఉన్నదానితో తృప్తిని వెతుక్కుంటూ, పిల్లలపై ఎలాంటి అంచనాలు, ఆశలు పెట్టుకోకుండా స్వేచ్ఛగా జీవించమని సూచించారు. విశ్రాంతి తీసుకుంటూనే.. మంచి పుస్తకాలు, పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలనీ, టీవీ చూడటం లేదా నచ్చిన ఇతర వ్యాపకాల ద్వారా నిరంతరం ఆనందాన్ని పొందాలన్నారు. ఇంతకాలం ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములై, ప్రజలకు అందించిన నిరంతర సేవలకు ఎమ్మెల్యే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, మాజీ కౌన్సిలర్లు టి.హనుమంతు, బండి భారతి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
