అనంతపురం జిల్లా,తాడిపత్రి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాడిపత్రి నియోజకవర్గం యాడికి సమీపంలోని పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడారు. బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్, ఉపాధి హామీ సహా వివిధ అంశాలపై రైతులు, కూలీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులైన నీలం శ్రీనివాసరెడ్డి, లక్కు శ్యామలతో రిజర్వాయర్ పరిధిలో సాగునీటి అవసరాలు, సాగు కోసం ఎలాంటి విధానాలు అవలంభిస్తున్నారన్న అంశాలపై వారితో మాట్లాడారు. రైతులు పరిమి చరణ్ కుమార్, పాపసాని ముని యుగంధర్లతోనూ బిందుసేద్యంతో కలుగుతున్న ప్రయోజనాలపై చర్చించారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ప్రభుత్వం తమకు 90 శాతం సబ్సీడికి ఇస్తోందని రైతులు సీఎంకు తెలిపారు. ప్రీమాన్ సూన్ డ్రై సోయింగ్ విధానం ద్వారా చేస్తున్న సాగు గురించి రైతులు హరికృష్ణ, దేవిల నుంచి ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా విధానం ద్వారా సాగు వ్యయం తగ్గుతోందని రైతులు సీఎంకు వివరించారు. సాగులో అర్ధచంద్రాకార గుంతల విధానం ద్వారా నేల సారవంతంగా మారి మెరుగైన ఫలితాలు వస్తున్నట్టు రైతులు నందిని, ప్రమీలమ్మ ముఖ్యమంత్రికి తెలిపారు.
