పల్నాడు జిల్లా, చిలకలూరిపేట.
*టీటీడీ ఛైర్మన్ వ్యాఖ్యలపై నిరసన: చిలకలూరిపేటలో విడదల రజని ప్రత్యేక పూజలు*
పల్నాడు జిల్లా చిలకలూరిపేట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం చిలకలూరిపేటలో వైఎస్ఆర్సిపి శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక అర్చనలు చేశారు.
*తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు: విడుదల రజని*
పూజల అనంతరం మాజీ మంత్రి విడుదల రజని మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు చేసిన వ్యాఖ్యలు శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆమె మండిపడ్డారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం, కూటమి ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అపచారాల నుంచి స్వామివారిని కాపాడాలని, తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడాలని ఈ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని, ఇప్పటికైనా ప్రభుత్వం తన ధోరణి మార్చుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
