పత్రికా ప్రకటన
అమరావతి
01-04-2026
రాజధాని అమరావతికి చట్టబద్ధత లభిస్తున్న తరుణంలో జగన్ రెడ్డి వెన్నులో వణుకు
తాడేపల్లి ప్యాలెస్లో మద్దతన్న జగన్-లోక్ సభలో వ్యతిరేకించిన వైసిపి సభ్యులు
అమరావతి రాజధానితో ప్రజల కలల సాకారానికి కృషి చేస్తున్న సిఎం చంద్రబాబు
కమీషన్ల జాడల కోసం ఆరాటపడుతున్న మాజీ సిఎం జగన్రెడ్డి
మూడు ముక్కలాటతో వైజాగ్లో రూ.500 కోట్ల ప్యాలెస్తో ప్రజల్ని వంచించిన జగన్
రాయలసీమకు ఐదేళ్లపాటు తీరని ద్రోహం
రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యల పట్ల ధ్వజమెత్తిన
ధ్వజమెత్తిన మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్
తన దుష్ట, విధ్వంసకర ఆలోచనలకు విరుద్ధంగా రాజధాని అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత లభిస్తున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని, దీంతో నిరాశానిస్పృహలకు లోనై రాజధానిపైన, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుపైనా అవాకులు చవాకులు, అసంబద్ధ వ్యాఖ్యలు చేసి జగన్రెడ్డి తన రాజకీయ దిగజారుడుతనాన్ని వెల్లడించుకున్నారని వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. బుధవారంనాడు ఎంపిక చేసుకున్న పాత్రికేయులతో కూడిన పత్రికా సమావేశంలో ఈ అంశంపై జగన్ వ్యాఖ్యలను మంత్రి నేడొక ప్రకటనలో తీవ్రంగా దుయ్యబట్టారు.
రాజధాని అమరావతి చట్టబద్ధత దిశగా రాష్ట్ర శాసన సభ తీర్మానం చేసిన అనతి కాలంలోనే కేంద్రంలోని కూటమి ప్రభుత్వం ఈ దిశగా లోక్ సభలో బుధవారంనాడు బిల్లును ఆమోదింపజేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, హోం మంత్రి శ్రీ అమిత్షాకు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పలు పార్టీలకు కూడా మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
వెల్లడైన జగన్ మోసం
బుధవారంనాటి పత్రికా సమావేశంలో అమరావతి రాజధానికి తాను వ్యతిరేకిని కాదని తాడేపల్లి ప్యాలెస్లో జగన్రెడ్డి వెల్లడించిన కొద్ది గంటల్లోనే లోక్ సభలో వైసిపి సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా వాకవుట్ చేయడం జగన్రెడ్డి మోసపూరిత వైఖరిని వెల్లడించిందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఎత్తిచూపారు. ఆదినుంచి జగన్రెడ్డి ఈ మోసపూరిత వైఖరిని పాటించినందునే గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసిపికి పాతర వేశారని, ఆయినా ఆయనలో కనువిప్పు కలగలేదని మంత్రి అన్నారు. గతంలో రాష్ట్ర శాసన సభ సాక్షిగా కనీసం 33,000 ఎకరాల్లో అమరావతిలో రాజధానిని నిర్మించాలని సూచించిన జగన్రెడ్డి అనంతరం విశాఖపట్నంలోని విలువైన వేలాది ఎకరాల భూములను బినామీలపరం చేసి మూడు ముక్కలాటకు తెరతీసి కేవలం తన కుటుంబం కోసం విశాఖపట్నంలో రూ.500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్ రెడ్డి ప్రస్తుతం శర వేగంగా జరుగున్న అమరావతి నిర్మాణ పనుల్లో లొసుగులు వెతకడం ఆయనలో పాతుకుపోయిన పచ్చకామెర్ల వ్యాధికి ప్రత్యక్ష తార్కాణమని మంత్రి ఎద్దేవా చేశారు.
భిన్న రీతులు
ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధానిని కోల్పోయి ఉసూరు మంటున్న నవ్యాంధ్ర ప్రజల కలల సాకారం కోసం ఉన్నత ప్రమాణాలతో కూడిన రాజధానికి అమరావతిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలు వేయగా అనంతరం అధికారంలోకొచ్చిన జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాజధాని విధ్వంసానికి గురైన విషయం ప్రజలకు తెలుసునని మంత్రి అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజల కలలు కనిపిస్తుంటే మాజీ సిఎం జగన్ అందులో లేని అవినీతి జాడలను వెతుక్కుంటున్నారని మంత్రి ఎండగట్టారు.
ప్రశ్న..సమాధానం; రెండూ జగన్ వే
అమరావతి రాజధాని కోసం శాసన సభ తీర్మానం ఎందుకు అని ప్రశ్నించిన జగన్రెడ్డి సమాధానం కూడా తానే చెప్పుకున్నారని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఎత్తిచూపారు. మరో ప్రభుత్వం అధికారంలోకొస్తే దీనికి భిన్నంగా మరో తీర్మానం చేయకూడదా అన్న జగన్ వ్యాఖ్యలోనే దీనికి సమాధానం ఉందని మంత్రి తెలిపారు. అటువంటి వినాశకర, విధ్వంసకర చర్యల్ని అడ్డుకోడానికే పార్లమెంటు చట్టం ద్వారా రాజధాని అమరావతికి శాశ్వతత్వం కల్పించడానికే రాష్ట్రం మరియు కేంద్రంలోని కూటమి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయని మంత్రి వివరించారు.
అసెంబ్లీకి ఎగనామం ఎందుకు జగన్?
తన తాడేపల్లి ప్యాలెస్లో రాజధాని అమరావతి నిర్మాణంపై పలు ప్రశ్నలు సంధించిన జగన్రెడ్డి తన పార్టీకి చెందిన 11 మంది సభ్యులతో సహా శాసన సభ సమావేశాలకు ఎందుకు హాజరు కావడంలేదో జవాబివ్వాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నిలదీశారు. ఇవే అంశాలను తమను ఎన్నుకున్న ప్రజల తరఫున శాసన సభలో లేవనెత్తితే వాటికి మరింత విలువ ఉండేదని…అలా కాకుండా పత్రికా సమావేశాల్లో చేసే ఊకదంపుడు ఉపన్యాసాలకు నిబద్ధత ఉండదనే విషయాన్ని జగన్రెడ్డి గుర్తించాలని మంత్రి సూచించారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భవ్య రాజధాని అమరావతి ఆవిష్కారాన్ని జగన్రెడ్డి కుట్రలు, దుష్ప్రచారంతో అడ్డుకోలేరని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
రాయలసీమకు తీరని ద్రోహం
అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు ముక్కలాటకు తెరతీసిన మాజీ సిఎం తన ఐదేళ్ల పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం చేశారని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామన్న జగన్ తర్వాత రాయలసీమలో హైకోర్టు బెంచిని మాత్రమే ఏర్పాటు చేస్తామన్నారని…అయినా ఈ దిశగా కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదని మంత్రి తెలిపారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేయకపోగా కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపారని జగన్పై మంత్రి ధ్వజమెత్తారు. దీనికి భిన్నంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమ దృష్టితో అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రచించి అమలు చేస్తోందని మంత్రి వివరించారు.
