కాటి కోటేశ్వర క్షేత్రంలో శివరాత్రి శోభ: కాలినడక మార్గంలో భక్తుల సందడి!

తాడిమర్రి ఫిబ్రవరి 12 :-(YES 9Tv)మండలంలోని ప్రసిద్ధ శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవ శోభతో కళకళలాడుతోంది.
ఈ సందర్భంగా చిల్ల కొండయ్యపల్లి గ్రామం నుండి శ్రీ కాటి కోటేశ్వర క్షేత్రానికి కొండ మార్గం ద్వారా కాలినడకన వెళ్లే ప్రవేశ ముఖద్వారాన్ని చిల్ల కొండయ్యపల్లి గ్రామస్తులు అందరూ కలిసి ఘనంగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల తోరణాలు, ఏర్పాటు చేసి భక్తులను ఆహ్వానించేలా ప్రవేశద్వారాన్ని అందంగా తీర్చిదిద్దారు.
గ్రామ పెద్దలు, యువత, మహిళలు కలిసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి అలంకరణ పనులు చేపట్టడం విశేషం. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మార్గం శుభ్రపరిచి, భక్తి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా కాలినడక భక్తుల రాకపోకలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో ఈ ప్రవేశద్వారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రామస్తుల ఐక్యత, భక్తి భావం ఈ కార్యక్రమం ద్వారా స్పష్టంగా ప్రతిఫలించింది.

Posted Under AP
Editor