వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యమని, ఆయనది పూర్తిగా క్రిమినల్ మైండ్సెట్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెకింటీల సురేంద్ర కుమార్ విమర్శించారు. శుక్రవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు.
జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏమీ చేయకపోయినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టులను అడ్డుకున్నది జగనేనని ధ్వజమెత్తారు.
సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే, కంపెనీలకు లేఖలు రాస్తూ జగన్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సాఫ్ట్వేర్ నుండి అండర్వేర్ కంపెనీల వరకు రాష్ట్రం వదిలి వెళ్లడానికి జగన్ తీరే కారణమన్నారు. సీమ ప్రాజెక్టులకు ఒక్క టీఎంసీ నీరు అదనంగా ఇవ్వని జగన్, ఇప్పుడు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని.. సాగునీటి రంగంలో ఆయన చేసిన అన్యాయాన్ని ప్రజలు గమనించే ఎన్నికల్లో బుద్ధి చెప్పారని గుర్తుచేశారు.రాజకీయాల కోసం హిందువుల సెంటిమెంట్లను జగన్ దెబ్బతీస్తున్నారని, తిరుమల పవిత్రతను చెడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు సుస్థిరంగా ఉంటుందని, జగన్ ఆడుతున్న డేంజర్ గేమ్ నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసీపీ రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మోహనరాజ్, ధరణీ ప్రకాష్, గోపాల్, మురుగన్, గోపి, పాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.
జగన్ సిద్ధాంతం విధ్వంసం.. ఆలోచన అరాచకం: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్
