శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు సోమవారం రాత్రి గ్రామాలలోకి వెళ్లి ప్రజలకు నేరాల గురించి విస్తృత అవగాహన కల్పించారు. మహిళా భద్రత, సైబర్ సేఫ్టీ, రోడ్డు సేఫ్టీ వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ‘శక్తి యాప్’ వినియోగం, డిజిటల్ మోసాలు మరియు మహిళలు, బాలికలపై జరిగే నేరాలు, బాల్య వివాహాలు, మరియు ఫోక్సో (POCSO) కేసుల గురించి ప్రజలను చైతన్యపరిచారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, ఈవ్ టీజింగ్పై కూడా వివరించారు. పసిపిల్లలకు గుడ్ టచ్ (Good Touch) మరియు బ్యాడ్ టచ్ (Bad Touch) గురించి తెలియజేసి, పిల్లలను సురక్షితంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను తల్లిదండ్రులకు వివరించారు.
అంతేకాక, గ్రామాలలో అందరూ కలిసిమెలిసి జీవించాలని, ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలకు తావు ఇవ్వకూడదని పోలీసులు సూచించారు. తమ పిల్లలను బాగా చదివించుకొని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు హితవు పలికారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు.
