తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు గంటల ముందు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లా మొత్తం ఆందోళనకు గురి చేసింది. పోలీసుల కథనం ప్రకారం, రెండు గ్రూపుల మధ్య మొదలైన వాగ్వాదం క్రమంగా హింసాత్మక దాడిగా మారి, ఈ విషాదం చోటుచేసుకుంది.
సుమారు 70 మందికి పైగా ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో మరొక పార్టీ నేత అనుచరులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్ర గాయాలైన మల్లయ్యను హైదరాబాద్కు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మల్లయ్యతో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవతో సహా మరో 15 మంది కూడా గాయపడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ శ్రేణులే ఇలా చేశారని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఆరోపించారు.
ఘర్షణతో గ్రామంలో పరిస్థితి విషమించడంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక చర్యలు జరగకుండా ఉండేందుకు గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి, అదనపు బలగాలను మోహరించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. పోలింగ్ జరగనున్న సమయంలో ఈ హత్యోదంతం రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది.
