Latest Posts

తెలంగాణకు ఆమ్రపాలి మళ్లీ రాక..?

కొద్దిరోజుల కిందట తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిపోయారు. తాజాగా క్యాట్ తీర్పుతో ఆమె తెలంగాణకు రానున్నారు. ఇప్పుడు ఆమెకు ఎలాంటి పదవి ఇస్తారనేది ఆసక్తిగా మారింది.

 

కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌-క్యాట్‌ ఆదేశాల మేరకు తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వనున్నారు ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి. ఆమెని తెలంగాణ క్యాడర్‌ సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా ఆమె పని చేస్తున్నారు. ఆమెను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలంటూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.

 

ఏపీ విభజన నేపథ్యంలో ఏపీ క్యాడర్‌కు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని సవాల్ క్యాట్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు ఆమ్రపాలి. దీనిపై ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మంగళవారం తీర్పు వెల్లడించింది. ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తూ మరి కొందరికి సడలింపు ఇవ్వడాన్ని ఈ సందర్భంగా తప్పుబట్టింది క్యాట్‌.

 

ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మార్గదర్శకాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నది ఆమ్రపాలి వాదన. పరస్పర బదిలీకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కోలా నిబంధనలు అమలు చేయడం సరికాదన్న ఆమె వాదనతో ఏకీభవించింది. చివరకు ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ ఇటీవల జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. ఆమెను తెలంగాణకు కేటాయించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.

 

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే ముందు ఆమె జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పని చేసేవారు. మళ్లీ ఆమెని అదే శాఖకు నియమిస్తారా? ఏపీలో మాదిరిగా టూరిజం విభాగం అప్పగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై అధికారులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

 

త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. మూసీ ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఆమెకు మళ్లీ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రావచ్చని అంటున్నారు. విధుల నిర్వహణలో ఆమ్రపాలి ముక్కుసూటిగా ఉంటారనే పేరు ఉంది.

Editor