400 టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు..! ఆ స్థావరాలను ధ్వంసం చేశాం.. కల్నల్ సోఫియా ఖురేషి..

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్‌ సిందూర్‌”పై అధికారిక ప్రకటనలు చేసింది. రక్షణ శాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖ సంయుక్తంగా ఓ మీడియా సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి యుద్ధ పరిస్థితుల గురించి వివరాలు వెల్లడించారు.

 

కల్నల్‌ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. భారత్ సరిహద్దుల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ రెచ్చగొట్టే‌ చర్యలకు పాల్పడుతోందని, దాడుల ద్వారా ఉద్రిక్తతలను మరింతగా పెంచుతోందని ఆమె చెప్పారు. అయితే భారత సైన్యం ఈ చర్యలను సమర్థవంతంగా తిప్పికొడుతోందని, పాక్‌ చర్యలకు తగిన సమాధానం ఇస్తోందని స్పష్టం చేశారు.

 

శ్రీనగర్‌, ఉధంపూర్‌, బటిండా ప్రాంతాల్లో పాక్ సైన్యం దాడులు చేసిందని.. పలు చోట్ల పాఠశాలలు, వాయుసేన ఆసుపత్రులపై కూడా దాడులు జరిగాయని ఆమె తెలిపారు. భుజ్‌, బటిండా ప్రాంతాల్లోని ఎయిర్‌స్టేషన్లపై కూడా పాక్‌ మిసైల్‌ దాడులు చేసిందని సోఫియా ఖురేషి చెప్పారు.

 

అయితే భారత సైనిక బలగాలు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉన్నాయని, ఏ విధమైన ముప్పునైనా సమర్థంగా ఎదుర్కొనేంత సన్నధతో ఉన్నాయని ఆమె అన్నారు. భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్తాన్.. డ్రోన్లతో దాడులు జరిపినట్టు వెల్లడించారు. అర్ధరాత్రి 1.40 గంటల తర్వాత పాక్‌ దాడులు మరింత తీవ్రంగా మారినట్టు చెప్పారు.

 

మరోవైపు పాక్‌ భూభాగంలోని పలు ప్రాంతాల్లోని ఎయిర్‌లాంచర్లను ధ్వంసం చేసినట్టు భారత వైమానిక దళాలు తెలిపాయి. ఈ క్రమంలో సాధ్యమైనంత వరకు సామాన్య పౌరుల ప్రాణ నష్టాన్ని నివారించే విధంగా దాడులను నిర్వహించామని రక్షణ శాఖ వివరించింది.

 

భారత భూభాగంలోని ఆలయాలు, నివాసాలపై నిరంతర దాడులకు పాకిస్తాన్‌ పాల్పడుతోందని కూడా కల్నల్‌ సోఫియా పేర్కొన్నారు. 300 నుంచి 400 టర్కీ టెక్నాలజీ డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించిందని.. అయితే వాటిని సమర్థవంతంగా భారత సైన్యం తిప్పికొట్టిందని ఆమె చెప్పారు. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలోని ప్రసిద్ధ శంభు ఆలయంపై పాక్ డ్రోన్ల్‌తో దాడి‌ జరిపిందని తెలిపారు. ఈ దాడిలో ధ్వంసమైన ఆలయ దృశ్యాలను రక్షణ శాఖ విడుదల చేసింది.

 

అయితే మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే లక్ష్యంతో భారత సాయుధ బలగాలు అపారమైన ధైర్యంతో, కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.

 

వింగ్ కమాండర్ ఒమికా సింగ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ తన రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోందని తెలిపారు. పాకిస్తాన్ డ్రోన్లు.. లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఉపయోగిస్తూ పటాన్ కోట్, ఉధంపూర్, బుజ్ ప్రాంతాలపై దాడులకు పాల్పడిందని ఆమె వెల్లడించారు. అయితే, భారత సైన్యం పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిందని, భారత్ కేవలం పాకిస్తాన్‌లోని మిలిటరీ కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిందని ఆమె స్పష్టం చేశారు. పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోందని.. భారత వైమానిక దళ స్టేషన్లకు ఎలాంటి నష్టం జరగలేదని వింగ్ కమాండర్ ఒమికా సింగ్ పేర్కొన్నారు.

 

విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి మాట్లాడుతూ.. భారత్ కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400 ను పాకిస్తాన్ ధ్వంసం చేసినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. సిర్సా, సూరత్ ఘడ్ వైమానిక దళ స్టేషన్లకు ఎలాంటి నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ సామాన్య ప్రజలపై దాడులు చేస్తోందని, ఈ దాడుల్లో ఒక అధికారి మరణించారని విక్రమ్ మిస్త్రి వెల్లడించారు.

 

మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపేందకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే ఇందుకు ముందుగా భారత్‌ దాడులు చేయడం నిలిపివేయాలని పాకిస్తాన్‌ మంత్రి షరతు పెట్టారు. భారత్‌ నుంచి దాడులు ఆగితేనే, తాము ఉద్రిక్తతల తగ్గింపునకు సహకరిస్తామని స్పష్టం చేశారు.

 

అంతకుముందు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల గురించి తాజా పరిస్థితులను ప్రధాని మోడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొవాల్ వివరించారు.

Editor