పాక్‌ను అల్లకల్లోలం చేస్తున్న భారత్..!

మింగడానికి మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె కావాలంట. ఈ సామెత ఇప్పుడు పాకిస్తాన్‌కి సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య వైమానిక దాడులతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇక మరోవైపు చమురు నిల్వలు కూడా అడుగంటి పోయాయి. రాజధాని ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు అన్ని పెట్రోల్ బంక్‌లను మూసివేశారు. పాక్ ప్రధాన ఎయిర్ బేస్‌లపై ఇండియన్ ఆర్మీ దాడులు చేయడంతో.. తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంధన కొరతతో పాటు, సంక్షోభ భయం కూడా అక్కడ ప్రజలను ప్రతిరోజు వెంటాడుతోందనే చెప్పాలి. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్‌పై ఇవాల్టి నుంచి రేషన్ విధానాన్ని ఆదేశించింది. గురువారం ఆ దేశంపై భారత్ జరిపిన దాడులతో స్టాక్ మార్కెట్లు కూడా ఒక్కసారిగా కుదేలయ్యాయి.

 

ఆర్మీ వాహనాలకు కూడా పెట్రోల్ డీజిల్ వాడేందుకు లేదు

 

ఇక చమురు కొరతకు సంబంధించి అక్కడ పరిస్తితి ఏ విధంగా ఉందంటే.. ఆర్మీ వాహనాలకు కూడా పెట్రోల్ డీజిల్ వాడేందుకు లేదు. పెట్రోల్ బంకులన్ని మూసివేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పాక్ పౌరులు ఖాళీ అయిన ఏటీఎంలతో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు పెట్రోల్ కూడా దొరకకపోవడంతో సమాన్యులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.

 

చేతిలో చిల్లి గవ్వ లేదు. బయట అప్పు పుట్టే పరిస్థితి లేదు

 

చేతిలో చిల్లి గవ్వ లేదు. బయట అప్పు పుట్టే పరిస్థితి లేదు. జనాలు తిట్టిపోస్తుంటే.. ఎంపీలు ఏడుస్తుంటే.. ఆయుధ పరంపర దూసుకొస్తుంటే.. పాకిస్తాన్ కుట్రలు, కుయుక్తులు భగ్నమైపోతున్నాయి. ఇటు భారత్‌లో విజయ దరహాసం. ఉన్నత స్థాయిలో వరుస సమావేశాలు. మరోవైపు నుంచి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల నేపథ్యంలో… పాక్ చరిత్రలో కలిసిపోవడమే మిగిలుందా!

 

పాకిస్థాన్‌కి కూడా అన్ని రకాల ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేసింది భారత్

 

మరోవైపు పాకిస్థాన్‌ను భారత్ అష్టదిగ్బంధనం చేస్తోంది. దాయాది దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు.. వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే.. పాక్‌ను మరో చావుదెబ్బ కొట్టింది ఇండియా. పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. పాకిస్థాన్ నుంచి భారత్ ఎలాంటి వస్తువులను దిగుమతి చేసుకోదు. అలాగే.. పాకిస్థాన్‌కి కూడా అన్ని రకాల ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేసింది.

 

వాణిజ్య నిషేధంతో పాక్‌ని మరో గట్టి దెబ్బకొట్టింది భారత్

 

ప్రత్యక్ష ఎగుమతులు, దిగుమతులతో పాటు పరోక్ష దిగుమతుల్ని కూడా రద్దు చేసింది. ఈ నిర్ణయం.. వాణిజ్య, ఆర్థిక రంగాల్లో పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు భారత్ చేపట్టిన దీర్ఘకాలిక వ్యూహాల్లో ఓ భాగంగా చెబుతున్నారు. ఇప్పటికే.. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడం, అట్టారీ-వాఘా సరిహద్దుని మూసేయడం, పాకిస్థానీ రాయబార కార్యాలయ సిబ్బందిని తగ్గించడం లాంటి చర్యలు చేపట్టిన భారత్.. ఈ వాణిజ్య నిషేధంతో పాక్‌ని మరో గట్టి దెబ్బకొట్టిందనే చెప్పాలి.

 

పాకిస్థాన్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని కూడా మూసేసింది

 

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్ నుంచి తగులుతున్న ఒక్కో దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడిపోతోంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో వాణిజ్య యుద్ధం కూడా తీవ్రమైంది. ప్రజా ప్రయోజనం, జాతీయ భద్రత ఆధారంగా.. పాకిస్థాన్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతుల్ననింటిని భారత్ నిషేధించింది. ఇప్పటికే భారత్-పాక్ మధ్య ఉన్న ఏకైక భూ సరిహద్దు కేంద్రం.. అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ని మూసేశారు. దాంతో.. భూమార్గం ద్వారా వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. పాకిస్థాన్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని కూడా మూసేసింది. దాంతో.. వాణిజ్య రవాణాకు సంబంధించిన విమాన సేవలు కూడా ఆగిపోయాయి. మొత్తంగా పాకిస్థాన్ నుంచి అన్ని రకాల వస్తువుల ఎగుమతులు, దిగుమతుల్ని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా నిషేధించారు.

 

వాణిజ్య యుద్ధంతో.. దాయాది దేశం మరింత ఎఫెక్ట్ కానుంది

 

ఇప్పటికే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలహీనంగా ఉంది. ఇప్పుడు భారత్ ప్రకటించిన వాణిజ్య యుద్ధంతో.. దాయాది దేశం మరింత ఎఫెక్ట్ కానుంది. తాజా నిషేధంతో.. ఔషధాలు, రసాయనాలు, పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ లాంటి వస్తువుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. గతేడాది పాకిస్థాన్ నుంచి భారత్‌కు.. సుమారు 305 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి అయ్యాయి. ఆ లెక్కన చూస్తే.. పాకిస్థాన్‌ ఇప్పుడు భారీగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక.. భారత వస్తువులు.. దుబాయ్, సింగపూర్, శ్రీలంక దేశాల ద్వారా పాకిస్థాన్‌కు చేరుతున్నాయి. పాకిస్థాన్ కూడా భారత వాణిజ్య ఆంక్షలను అధిగమించేందుకు.. కొన్ని వస్తువుల్ని దుబాయ్, సింగపూర్, కొలంబో ఓడరేవుల ద్వారా పంపుతోంది.

 

ఆహార కొరతతో పాటు ఔషధాల కొరత

 

ఇలా పరోక్షంగా జరిగే వాణిజ్యం విలువ సుమారు 10 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నిషేధంతో.. ఈ తరహా వాణిజ్యం కూడా ఆగిపోనుంది. ఈ చర్యల వల్ల పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆహార కొరతతో పాటు ఔషధాల కొరత తీవ్రమవుతుందని అంచనా వేస్తున్నారు. 2023-24 మధ్య అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్-పాక్ మధ్య 3 వేల 887 కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది. ఈ వాణిజ్య నిషేధంతో పాక్‌లో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగడం. ఎగుమతి అవకాశాలు తగ్గడం లాంటి సమస్యలు తలెత్తనున్నాయి.

Editor