పాక్‌లోని ఆ 6 ఎయిర్ బేస్‌లు ధ్వంసం.. !

అసలైన యుద్ధం మొదలైంది. మూడు రోజులుగా ప్రాక్టీస్ మ్యాచ్ తరహాలో వార్ జరిగింది. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం యుద్ధం జోరు పెరిగింది. డ్రోన్లు, మిస్సైళ్ల స్థానంలో ఫైటర్ జెట్లు, ఖండాంతర క్షిపణులు రంగంలోకి దిగాయి. భారత్‌లో సైతం కాస్త డ్యామేజ్ కనిపిస్తోంది. పాకిస్తాన్‌లో అంతకుమించి నాశనం అవుతోంది. ఆర్మీ స్థావరాలు, ఎయిర్‌బేస్‌లే లక్ష్యంగా పాక్, భారత్‌లు బీభత్సంగా దాడులు చేసుకుంటున్నాయి. ఇండియాకు చెందిన 4 ఎయిర్‌బేస్‌లను పాక్ టార్గెట్ చేస్తే.. మనం పాకిస్తాన్‌కు చెందిన 6 ఎయిర్‌బేస్‌లను స్మాష్ చేశాం. దెబ్బకు దెబ్బతో సరిహద్దుల్లో హైరేంజ్ వార్ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచీ మరో లెక్క.. తరహాలో పాక్‌పై విరుచుకుపడుతోంది ఇండియన్ ఆర్మీ.

 

ఎయిర్ బేస్‌లపై అటాక్

 

శనివారం తెల్లవారుజామున 1.40కి హైస్పీడ్ బాలిస్టిక్ మిసైల్స్‌తో పంజాబ్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్థావరాలపై అటాక్ చేసింది పాకిస్తాన్. ఉధంపుర్, భుజ్, పఠాన్‌కోట్, భరిండాలోని వాయుసేన స్థావరాలపైనా దాడులు చేసింది. అక్కడి మన సిబ్బంది గాయపడగా.. పరికరాలు దెబ్బతిన్నాయి. మన జోలికి వస్తే ఇండియా ఊరుకుంటుందా? పెద్ద స్థాయిలో ప్రతీకార దాడులు చేసింది భారత సైన్యం. పాక్‌లోని ఎయిర్‌బేస్‌లు, మిలిటరీ కేంద్రాలు, రాడార్ స్టేషన్లపై బాంబులతో విరుచుకుపడింది. ఫైటర్ జెట్లు రంగంలోకి దిగి.. పస్రూర్, సియాల్‌కోట్‌లోని ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేశాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్ మిలిటరీ ఎయిర్‌బేస్‌ను తునాతునకలు చేసింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. వెంటనే ఆ ఎయిర్ బేస్‌ను మూసేసింది పాక్.

 

పాక్‌పై సీరియస్ వార్

 

దాయాది దేశానికి చెందిన 6 ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకొని భారత్ ఎటాక్‌ చేసింది. రాత్రి 4 ఎయిర్‌బేస్‌లను టార్గెట్ చేసిన ఇండియా.. తాజాగా మరో 2 ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా మెరుపు దాడి చేసింది. మొత్తంగా రఫీకీ, మురిద్, చక్లాల, రహీమ్ యార్ ఖాన్, సుక్కుర్, చునియాన్ ఎయిర్‌బేస్‌లు ఇండియా దాడిలో ధ్వంసం అయ్యాయి. పస్రూర్‌లోని రాడార్ స్టేషన్, సియాల్‌కోట్‌లోని ఏవియేషన్ బేస్ పనికిరాకుండా పోయాయి. భారత్ చేసిన దాడులను పాక్‌ ఆర్మీ కూడా ధృవీకరించింది. ఓవైపు డ్రోన్స్‌, మిస్సైళ్ల దాడులను తిప్పికొడుతూనే.. మరోవైపు ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్‌ను ధ్వంసం చేస్తోంది ఆర్మీ. సియోల్‌కోట్‌లోని పాక్‌ పోస్టులు, టెర్రర్‌ లాంచ్ ప్యాడ్స్ లక్ష్యంగా దాడులు చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ.

 

పాక్ ఫైటర్‌జెట్స్ డౌన్

 

పాక్‌కు మరో బిగ్‌షాక్‌ తగిలింది. పాక్‌కు చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చివేసింది భారత్‌. P.A.F కు చెందిన ఫైటర్ జెట్లు భారత గగనతలంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశాయి. వెంటనే అలర్టయిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌.. పాక్‌ ఫైటర్ జెట్లను చుట్టుముట్టాయి. శ్రీనగర్‌, బారాముల్లా, బుద్గాం గగనతలంలో రెండు దేశాల ఫైటర్ జెట్ల మధ్య డాగ్‌ఫైట్‌ జరిగింది. చివరికి రెండు పాక్‌ ఫైటర్‌ జెట్లను కూల్చివేసింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌. పాక్ పైలెట్ల కోసం సీఆర్పీఎఫ్‌, ఇండియన్ ఆర్మీ గాలింపు ముమ్మరం చేసింది.

 

శ్రీనగర్‌పై పాక్ అటాక్

 

శనివారం ఉదయం శ్రీనగర్‌పై పాక్‌ అటాక్ చేసింది. పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. ఎయిర్‌పోర్టు సమీపంలో 2 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవంతిపురం ప్రాంతంలో ఐదుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో క్షిపణి లాంటి వస్తువు పడినట్లు గుర్తించారు. శ్రీనగర్‌ విమానాశ్రయంపై, ఎయిర్‌ బేస్‌పై డ్రోన్లతో దాడి చేయగా సైన్యం వాటిని తిప్పికొట్టింది. శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ అధికారులు సైరన్లు మోగించారు. నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియాలోని 32 విమానాశ్రయాలను ఈనెల 15 వరకు మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

 

భారత్‌పై బాలిస్టిక్ మిసైల్‌తో అటాక్

 

మరోవైపు, భారత్‌పై ఏకంగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది పాకిస్తాన్. ఫతాహ్‌-1 బాలిస్టిక్‌ మిస్సైల్‌ను ప్రయోగించగా.. భారత డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. హర్యానాలోని సిర్సా దగ్గర మిస్సైల్‌ను కూల్చివేయడంతో భారీ ముప్పు తప్పింది. సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పాక్‌ మిస్సైల్స్‌ శకలాలు భయపడుతున్నాయి. శుక్రవారం రాత్రి భుజ్‌, కచ్‌ టార్గెట్‌గా పాక్‌ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేయగా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సమర్థవంతంగా ఢీకొట్టింది.

 

అమెరికా శాంతి శాంతి..

 

పాకిస్తాన్ సైన్యం భారత సరిహద్దుల దిశగా పెద్ద సంఖ్యలో తరలివస్తోందని ఇండియా తెలిపింది. ఎలాంటి అటాక్‌ను ఎదుర్కోడాకైనా సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. అటు, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం చేస్తోంది అమెరికా. రెండు దేశాల నేతలతో అమెరికా సెక్రటరీ మార్కో రూబియో చర్చలు జరిపారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు.

 

మోదీ హైలెవల్ మీటింగ్

 

భారత్-పాక్‌ వార్ నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ హైలెవల్‌ మీటింగ్‌ నిర్వహించారు. భేటీలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌ పరిణామాలు.. పాక్ దాడుల తీవ్రత పెరిగాక తీసుకోవాల్సిన యుద్ధ చర్యలపై చర్చించారు.

Editor