ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..! ఎందుకంటే..?

గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రెండు రోజుల పాటు హస్తినలో ఉండనున్నారు. సీఎంతోపాటు మరి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈసారి కచ్చితంగా కేబినెట్ విస్తరణ ఖాయమనే ప్రచారం ఆ పార్టీ నేతల్లో బలంగా ఉంది. అందుకే ఈసారి ఎమ్మెల్యేలు అటు వైపు ఫోకస్ చేశారు.

 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి పిలుపు వచ్చింది. గురువారం సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి హస్తినకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి.

 

శుక్ర, శనివారాల్లో అక్కడే ఉండనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. గురువారం రాత్రికి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ పాల్గొంటారు. అసెంబ్లీ తీర్మానం చేసిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై పార్టీ పెద్దలతో కలిసి చర్చించనున్నారు.

 

ఎస్సీ వర్గీకరణకు సంబంధించి షమీమ్‌ అక్తర్‌ కమిటీ రిపోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. దాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీనిపై అధిష్ఠానానికి వివరాలు వెల్లడించనున్నారు. రిపోర్టు నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలని అనేదానిపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు.

 

శుక్రవారం ఉదయం అగ్రనేత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి అధిష్టానానికి వివరించనున్నారు. వారిచ్చిన సలహాలు, సూచనల మేరకు తదుపరి అడుగులు వేయనున్నారు. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశమున్నట్లు గాంధీ‌భవన్ వర్గాల మాట.

 

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి విస్తరణ జరగడం ఖాయమని చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కొలిక్కి రావడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం నేతలంతా ఢిల్లీలో ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

Editor