జగన్ కు భారీ షాక్.. రాజకీయాలకు విజయసాయి రెడ్డి గుడ్ బై..!

రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగత విషయమని.. ఇకపై ఏ పార్టీలో చేరనని తెలిపారు.

 

వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్తేస్తున్నట్లు ట్వీట్టర్ వేదికగా తెలిపారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని…. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని వెల్లడించారు. సీఎం చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు.. పవన్‌ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని తెలిపారు.

 

“రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను.

 

రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా.

 

దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది.

 

నా భవిష్యత్తు వ్యవసాయం –

 

సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.” అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు.

Posted Under AP
Editor