రైతులకు శుభవార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. రుణ మాఫీ కాలేదని రైతులు ఎవరు బాధ పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆగస్ట్ రూ.14న లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణ మాఫీ చేయడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఒకే సారి రూ.2 లక్షల రుణ మాఫీ చేయలేదన్నారు.
గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.లక్ష కూడా రుణ మాఫీ చేయలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పోయారని అన్నారు. ఇప్పటి వరకు లక్షన్నర లోపు ఉన్న రైతులకు రుణ మాఫీ కాకుంటే ఏఈఓలకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏఈఓలకు మీ ఆధార్ నంబర్ చెబితే రుణ మాఫీకి సంబంధించి స్టేటస్ ఏమిటో చెబుతారని వివరించారు. రుణమాఫీ కానీ రైతులు వివరాలు ఇవ్వాలని ఇప్పటికే వ్యవసాయ అధికారులకు సూచినట్లు చెప్పారు.
రుణమాఫీలో టెక్నికల్ ఇష్యూ ఉంటే క్లియర్ చేస్తామన్నారు. రైతు చట్టాలతో కేంద్రం ఇబ్బంది పెట్టిందని.. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తుమ్మల అన్నారు. రైతుల పేరు మీద బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. రుణ మాఫీ కావాలని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. కాగా ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు ధపాలుగా రుణ మాఫీ చేసింది.
మొదటి దఫాలో రూ.లక్ష లోపు రుణ మాఫీ చేసారు. రెండో దశలో రూ.లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన తెలంగాణకు రాగానే.. మూడో దశ రుణ మాఫీకి సంబంధించి నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. చాలా మంది రైతులు మూడో విడత రుణ మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు.
