ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు.
అయితే, ప్రమాణస్వీకారం చేసిన తరువాత చంద్రబాబు తొలిసారిగా గురువారం సచివాలయానికి వచ్చారు. తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. సరిగ్గా సాయంత్రం 4.41 గంటలకు తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పలు హామీలకు సంబంధించిన ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేశారు.
