జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రానుండగా.. అదేరోజున ఆమె చేతులమీదుగా రాష్ట్రగీతం, రాజముద్రలను విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్.. పదేళ్ల తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న తొలి అవతరణ దినోత్సవ వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు.
రాష్ట్ర గీతం జయ జయహే కు తుది మెరుగులు దిద్ది మళ్లీ ఆవిష్కరిస్తున్నారు. అలాగే రాజముద్రను కూడా కొత్తగా రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో రాజముద్ర ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ రేకెత్తింది. రాష్ట్ర రాజముద్రను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మూడు డిజైన్లతో ఉన్న లోగోల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తొలి లోగో మధ్యలో పూర్ణకుంభం, దానికి ఇరువైపులా తంగేడు ఆకులు, పై భాగంలో మూడు సింహాలు, కింద చార్మినార్ ముద్ర ఉంది. అలాగే రెండో లోగో పైభాగంలో 3 సింహాల రాజముద్ర, మధ్యలో రాష్ట్ర మ్యాప్, కింద హుస్సేన్ సాగర్ లో ఉండే బుద్ధుని స్టాచ్యూ ఉంది. ఈ రెండింటిలో ఏదొక లోగోను రాష్ట్ర రాజముద్రగా ప్రకటించనున్నట్లు బుధవారం వార్తలొచ్చాయి.
నేడు తెలంగాణ కొత్త రాజముద్ర ఇదేనంటూ మరో లోగో బయటికొచ్చింది. ఈ లోగోలో రాష్ట్రాన్ని సాధించిన అమరవీరులకు గుర్తుగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని మధ్యలో ఉంచారు. దానికి ఇరువైపులా తంగేడు ఆకులు, పైన మూడు సింహాల రాజముద్ర ఉన్నాయి. చుట్టూ నాలుగు భాషల్లో హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో తెలంగాణ ప్రభుత్వము అని రాసి ఉంది.
తెలంగాణ రాజముద్ర మార్పులపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజముద్రలో రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉన్న చార్మినార్ ను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుండటం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ఆయన తప్పుబట్టారు. చార్మినార్ శతాబ్దాలుగా హైదరాబాద్ కు ప్రతిరూపంగా, గుర్తుగా ఉందని, హైదరాబాద్ ను తలచుకున్నవారెవరికైనా ముందుగా గుర్తొచ్చేది చార్మినారేనని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని కారణాలు చెబుతూ.. చార్మినార్ ను రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని చూస్తుండటం సిగ్గుచేటంటూ X వేదికగా మండిపడ్డారు.
కాగా.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపి.. తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
