Latest Posts

ఏపీలో 44 వేల వాలంటీర్ల రాజీనామా-హైకోర్టులో పిటిషన్..!

ఏపీలో ఎన్నికల వేళ సంక్షేమ పథకాల పంపిణీలో వాలంటీర్లను వాడొద్దంటూ గతంలో ఈసీ జారీ చేసిన ఆదేశాల తర్వాత వరుసగా రాజీనామాలు చేయడం మొదలుపెట్టేశారు. ముఖ్యంగా వైసీపీ నేతల సూచనలతో వాలంటీర్లు తమ ఉద్యోగాలను వదులుకోవడం ప్రారంభించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రాజీనామాలు చేసిన వాలంటీర్ల సంఖ్య ఇప్పటికే 44 వేలు దాటిపోయింది. వీరంతా రాజీనామాలు చేశాక వైసీపీకి నేరుగా పనిచేసుకుంటున్నారు. దీనిపై ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

 

రాష్ట్రంలో సంక్షేమ పథకాల పంపిణీకి ఈసీ తమను దూరం పెట్టిందన్న సాకుతో దాదాపు 44 వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు వదులుకుని వైసీపీ కోసం పనిచేస్తుండటంపై హైకోర్టులో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ పిటిషన్ దాఖలు చేసారు. వీరంతా రేపు ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నారని తన పిటిషన్ లో రామచంద్రయాదవ్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. వీరు అలా చేయకుండా అడ్డుకోవాలని హైకోర్టును కోరారు.

 

రాష్ట్రంలో 44 వేల మందికి పైగా వాలంటీర్లు వైసీపీ ఆదేశాల మేరకు రాజీనామాలు చేసి వారికి ఎన్నికల్లో సహకరిస్తున్నారని, కాబట్టి వారి రాజీనామాలు ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో యాదవ్ కోరారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఇప్పటికే ఈసీ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. కాబట్టి వారి రాజీనామాల్ని ఆమోదించకుండా ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరారు. దీనిపై రేపు హైకోర్టు విచారణ జరపనుంది.

Posted Under AP
Editor